హైదరాబాద్, నమస్తే తెలంగాణ : సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో కులమతాలకు అతీతంగా ఏ విధమైన విగ్రహాలూ ఏర్పాటు చేయరాదన్న ఆదేశాల్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం ముత్యాలమ్మ సెంటర్లో విగ్రహ నిర్మాణ చర్యలను వ్యతిరేకిస్తూ వీహెచ్పీకి చెందిన ఏ అంజయ్య దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని, కోర్టు ధికరణ వ్యాజ్యాన్ని శుక్రవారం హైకోర్టు విచారించింది. విచారణకు హాజరైన ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతం స్పందిస్తూ, నిర్మాణాల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని చెప్పారు. పది రోజుల్లోగా అమలు నివేదిక అందజేయాలని కలెక్టర్ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది.