హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖాన భవనం వినియోగించడానికి పనికిరాదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినట్టు ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. ఇద్దరు సభ్యుల నిపుణుల కమిటీ నివేదికపై మంగళవారం అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు.
భవనాన్ని దవాఖాన కోసం వినియోగించొద్దని, శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తొలగించి కొత్త భవనం నిర్మించాలని కొందరు, చారిత్రక భవనం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మరికొందరు వేసిన వేర్వేరు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం విచారించింది. పిల్స్పై తుది విచారణను ఫిబ్రవరి 12న చేపడతామని హైకోర్టు ప్రకటించింది.