హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పోలీసులు రక్షణ కల్పించాలన్న కిందికోర్టుల ఆదేశాలు అమలుకాకపోవడంతో కక్షిదారులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంటే న్యాయపరిపాలనపై ప్రభావం పడుతుందని పేర్కొంది. డిక్రీల అమలుకు పోలీసులు రక్షణ కల్పించే విషయంలో ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్వోపీ)రూపొందించే అంశాన్ని పరిశీలించాలని డీజీపీకి సూచించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన నల్లా వెంకటరెడ్డి సివిల్ జడ్జి ఇచ్చిన డిక్రీ అమలుకు పోలీసు రక్షణ కల్పించాలని గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపి, ప్రభుత్వ న్యాయవాది హామీ మేరకు పిటిషనర్ తన భూమికి కంచె వేసుకునే సమయంలో పోలీసులు రక్షణ కల్పించాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కొరటికల్కు చెందిన పీసారి గోపయ్య అప్పీల్ దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.
అప్పీలుదారు తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఏకపక్షంగా పొందిన డిక్రీ ఆధారంగా కోర్టు రక్షణ పొందారని, హైకోర్టు ఉత్తర్వులతో తమ భూమిలో జోక్యం చేసుకునే అవకాశం ఉందని పేరొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. డిక్రీ అమలుకు పోలీసులు రక్షణ కల్పించాలని కింది కోర్టు ఆదేశించినా అవి అమలు కాక మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల పాత్ర కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టంచేసింది. కింది కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించి వరుసగా హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి న్యాయపాలనకు ఆటంకం కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారానికి ప్రామాణిక కార్యాచరణ విధానం రూపొందించే అంశాన్ని పరిశీలించాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
భూమి హనుమాన్ ఆలయానిదే
వరంగల్ జిల్లా రూరల్ పర్వతగిరి మండలం కొండపాక గ్రామంలోని సర్వే నం.172 ఏ, బీ, సీలోని 3.11 ఎకరాల భూమి హనుమాన్ దేవాలయానిదేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ భూమి ఆలయానిదేనంటూ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రకంటి రవీందర్రావు మరో ఇద్దరు దాఖలుచేసిన పిటిషన్ను జస్టిస్ ఈవీ వేణుగోపాల్ కొట్టివేశారు. పిటిషనర్లు తాతల నుంచి ఇనామ్దారుగా తమకు భూమి సంక్రమించిందని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూమిని ప్రభుత్వ భూమిగా పేరొన్నారని వాదించారు.
అయితే ఆలయం దేవాదాయ చట్టం కింద నమోదైందని, దాని నిర్వహణ కోసం 3.11 ఎకరాల ఇనామ్ భూమి కేటాయించినట్టు ప్రభుత్వ న్యాయవాది భూక్యా మంగీలాల్ నాయక్ తెలిపారు. 2007 నుంచి పహాణీల్లో ఆలయం పేరు నమోదై ఉన్నప్పటికీ పిటిషనర్లు అప్పట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని న్యాయమూర్తి పేరొన్నారు. ఆలయానికి సంబంధించిన ఆస్తులు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నాయని, తగిన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేసినట్టు స్పష్టం చేస్తూ దాన్ని కొట్టివేశారు.