జైపూర్, సెప్టెంబర్ 3 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ అండదండలతో.. ఆయన పీఏ రమణారావు అక్రమాలకు అడ్డూఅదుపులేకుండా పోయిందని, ఈ విషయం స్వయంగా కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారని మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రైతుసదస్సులో ఆయన మాట్లాడారు.
‘నాడు బీఆర్ఎస్ హయాంలో 9 ఇసుక క్వారీలు ఉన్నయ్.. అవే ఇసుక క్వారీలు ఇప్పుడూ నడుస్తున్నయ్ కదా? మరీ మీరేం చేస్తున్నరు? బీఆర్ఎస్ దిగిపోయి వెయ్యి రోజులు గడుస్తున్నా.. ఇసుక క్వారీలు మీకు కన్పిస్తలేవా? ఎందుకు బంద్ జేస్తలేరు? గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నరా?’ అని ప్రశ్నించారు. ‘మంత్రి పీఏ రమణారావు దుకాణం బెట్టి నెలకు రూ.25 లక్షల మేర వసూళ్లకు పాల్పడుతుండు. ఈ మాటలు నేనంటలేను. కాంగ్రెస్ వాళ్లే చెప్పి పంపిస్తుండ్రు. మొత్తం పీఏనే వేసుకపోతుండు.. మాకేం ఉంటలేవు’ అని అంటున్నరు. ఇది మంత్రి వివేక్కు కనిపిస్తలేదా?’ అని ప్రశ్నించారు.
నియోజకవర్గ యువతకు 40 వేల ఉద్యోగాలిప్పిస్తామని.. ఇప్పుడు జర్మనీ, జపాన్ భాషలు నేర్చుకోవాలని యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారని సర్కార్పై మండిపడ్డారు. 40 వేల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రెండున్నరేండ్లు మంత్రి పదవికోసం పాకులాడారే తప్ప.. నియోజకవర్గ అభివృద్ధికోసం ఎలాంటి శ్రద్ధ చూపలేదని మంత్రి వివేక్పై మండిపడ్డారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా, గెలిచిన వివేక్ ఇతర రాష్ర్టాల్లో ఇతర దేశాల్లో కంపెనీలు పెట్టొచ్చు గాని.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఓ కంపెనీ పెట్టి నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ కథ ముగిసిందని, రాబోయేది కేసీఆర్ సర్కారేనని అన్నారు.