ముంబై : భారత వన్డే జట్టులో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. రోహిత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, అతడి స్థానాన్ని ప్రశ్నించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ సమీక్షా సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘రోహిత్ ప్రతీ మ్యాచ్లోనూ సూపర్గా ఆడుతున్నాడు. గత మ్యాచ్లో ఇంగ్లండ్పై 138 పరుగులు సాధించాడు. ఇక అతడి నుంచి ఇంకా ఏం కావాలి? అనవసరంగా ఊహాగానాలు సృష్టిస్తున్న వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టెస్టు, వన్డే కెప్టెన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొనగా.. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ గైర్హాజరయ్యాడు.
అగార్కర్ ముంబైలో లేకపోవడం, నెట్వర్క్ సమస్యల వల్ల ఆన్లైన్లో కూడా అందుబాటులోకి రాలేకపోయాడని సైకియా చెప్పారు. అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపుపై ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఇక, బీసీసీఐ డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్గా లక్ష్మణ్ నియామిస్తారని వస్తున్న వార్తలు పుకార్లేనని కొట్టిపారేశారు. ఈ నెల 19 నుంచి జరిగే ఆసియా గేమ్స్లో బరిలోకి భారత పురుషుల, మహిళల జట్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒకవేళ ఆర్గనైజర్ల నుంచి వసతులు సరిపోకపోతే, బోర్డు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్కు అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్తో పాటు సవాల్ విసిరే సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) దేశాల్లో టీమిండియా పర్యటనల కోసం రోడ్మ్యాప్ సిద్ధం చేసినట్లు సైకియా వెల్లడించారు. వన్డే వరల్డ్కప్ కోసం బెస్ట్ టీమ్ కాంబినేషన్ను తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.