హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ 2017లోని రూల్ 4(3)(ఏ)లో ప్రభుత్వం మార్పులు చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వం జారీచేసిన జీవో 75ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) కౌన్సిలింగ్లో గతంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)కి ఒక శాతం రిజర్వేషన్ ఉండేది. ప్రభుత్వం తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీస్ అడ్మిషన్ రూల్స్ 2017లోని రూల్ 4(3)(ఏ)లో మార్పులు చేస్తూ జూలై 4న జీవో 75ను జారీచేసింది. ఈ జీవో వల్ల ఎన్సీసీ అభ్యర్థులకు ఒక శాతం రిజర్వేషన్ కోటా లేకుండా పోయిందంటూ హైదరాబాద్కు చెందిన లోకాస్వీ ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.