హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఆన్లైన్లోనూ విద్యాబోధననకు అనుమతించాలని హైకోర్టు పేర్కొన్నది. కొవిడ్ నేపథ్యంలో విద్యా సంస్థలకు రావడానికి ఆసక్తి చూపని విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యక్ష తరగతులకు సమాంతరంగా ఈ నెల 28 వరకు ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. కొవిడ్పై దాఖలైన వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. సమ్మక జాతర, రామానుజ సహస్రాబ్ది వేడుకలు సహా అన్ని మతాలకు చెందిన ప్రార్థనా ప్రదేశాలు, హైదరాబాద్లోని మారెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాలని సూచించింది. రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని ప్రభుత్వానికి తెలిపింది.
కొవిడ్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టుకు వివరించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నదని, 99 లక్షల ఇండ్లలో జ్వరసర్వే చేసి 4.32 లక్షల మందికి మందుల కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. పాఠశాలల్లో కొవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని పాఠశాల విద్యాశాఖ నివేదించింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.