హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అందిన 2 నివేదికల ప్రకారం దర్యాప్తు సంతృప్తికరంగానే ఉన్నదని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటనర్సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. సిట్ దర్యాప్తును వేగవంతం చేయాలని సూచిస్తూ.. ప్రస్తుత తరుణంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయబోమని తేల్చి చెప్పారు.
టీఎస్పీఎస్సీలో రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఎంతమంది పనిచేస్తున్నారు? వారిలో ఎంతమంది పరీక్ష రాశారు? 100 మారులు సాధించిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? వారిలో టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? లీకేజీలో ఇంకా ఎంతమందికి ప్రమేయం ఉంటుందని భావిస్తున్నారు? దర్యాప్తునకు ఇంకా ఎంత సమయం పడుతుంది? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదన వినిపిస్తూ.. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సీఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇంకా రానందున దర్యాప్తులో కాస్త జాప్యం జరుగుతున్నదని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నదని, పరీక్ష రాసిన టీఎస్పీఎస్సీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులతోపాటు కమిషన్ చైర్మన్, కార్యదర్శి, సభ్యుడిని సైతం సిట్ ఇప్పటికే విచారించిందని వివరించారు. దీంతో ముగ్గురు పోలీస్ కమిషనర్లల్లో ఒకరు దర్యాప్తును సమీక్షించి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీచేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను జూలై 5కు వాయిదా వేశారు.