హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం దర్గాఖలీసాఖాన్ గ్రామ పరిధిలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో పిటిషనర్లను ఖాళీ చేయించరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలతో 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్కు స్పష్టం చేసింది. ఈ ఈ మేరకు జస్టిస్ కే శరత్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కే వివేక్రెడ్డి, కే ప్రతీక్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం దర్గాఖలీసాఖాన్ గ్రామంలో పిటిషనర్లకు చెందిన 9.08 ఎకరాల భూమిని సేకరిస్తున్నారని తెలిపారు. హిమాయత్సాగర్ బండ్కు అర కిలోమీటరు దూరాన బయో కన్జర్వేషన్ జోన్లో ఉన్న ఆ భూమిని సేకరించేందుకు అధికారులు భూసేకరణ చట్టంలోని నిబంధనలను పూర్తిగా పాటించలేదని, దీనిపై తాము సమర్పించిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించకుండానే తిరసరించారని, సామాజిక ప్రభావంపై అధ్యయనం నిర్వహించకుండానే భూసేకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నారని వివరించారు.
2004లో ఇదే భూమిని టౌన్షిప్, భవిష్యత్ ప్రాజెక్టుల కోసం సేకరించేందుకు అధికారులు ప్రయత్నించడంతో ప్రజాప్రయోజనం స్పష్టంగా లేదన్న కారణంతో ఆ భూసేకరణను న్యాయస్థానం రద్దు చేసిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టంలోని నిబంధనల ప్రకారమే భూసేకరణ ప్రక్రియ జరుగుతున్నదని, చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాకే ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలపై విచారణ పూర్తయ్యే వరకు పిటిషనర్లను ఖాళీ చేయించబోమని పేర్కొంటూ.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో పిటిషనర్లను ఖాళీ చేయించవద్దని, భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలతో 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ శరత్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.