హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వట్టినాగులపల్లి గ్రామం ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్ పరివాహక ప్రాంతంలో లేనందున జీవో 111ను ఎత్తివేస్తూ తెచ్చిన జీవో 69 ఆ గ్రామానికి వర్తించదని హైకోర్టు తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 173, 178 నుంచి 214 వరకు, 216 నుంచి 260, 512ల్లోని ప్రాంతాలు పరివాహక ప్రాంతంలో లేవని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) 2006లో నివేదిక ఇచ్చిందని, దీని ప్రకారం జీవో 69 వట్టినాగులపల్లికి వర్తించదని తేల్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది.
జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో వట్టినాగులపల్లి ఒకటి. ఆంక్షలను ఎత్తివేస్తూ వెలువడిన జీవో 69 తమకు వర్తింపజేయడాన్ని అగ్ని అగ్రిటెక్ సహా నాలుగు కంపెనీలు హైకోర్టులో సవాల్ చేశాయి. తమకు మాత్రమే జీవో 69 వర్తింపజేయడం అన్యాయమని, సమీప ఇతర భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయని పిటిషనర్ల వాదన. పిటిషనర్లకు చెందిన వట్టినాగులపల్లి భూములు పరివాహక ప్రాంత పరిధిలో లేవని ప్రభుత్వం చెప్పింది. దీనిపై హైకోర్టు వెలువరించిన తీర్పులో.. వట్టినాగులపల్లికి విభిన్న భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఇతర 84 గ్రామాలకు భిన్నంగా ఉంది. ఒక కొండ పడమర వైపు నుంచి నీరు ఉస్మాన్ సాగర్కు చేరుతున్నది. తూర్పు వైపున నీరు వరద కాలువ ద్వారా మూసీలో చేరుతున్నది. ఇదే విషయాన్ని ఈపీటీఆర్ఐ చెప్పింది. కాబట్టి పిటిషనర్ల భూములు పరివాహక ప్రాంత పరిధిలోకి రావు. వాళ్లకు జీవో 69 వర్తించదు. కాబట్టి పిటిషన్లను అనుమతి ఇస్తున్నాం.. అని స్పష్టం చేసింది.