హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించే చర్యలకు పాల్పడ్డారనే అభియోగంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. జగ్జీవన్రాం జయంతి కారణంగా బుధవారం కోర్టుకు సెలవు కావటంతో న్యాయమూర్తి ఇంటి వద్ద తమ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎస్ సురేందర్రెడ్డి దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నిరాకరించారు.
తక్షణమే బండి సంజయ్కుమార్ను కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న హెబియస్కార్పస్ పిటిషన్ను రోజువారీ కోర్టులో విచారణకు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజీస్ట్రీకి ఉత్తర్వు జారీ చేశారు. హౌస్మోషన్ పిటిషన్ దాఖలు నేపథ్యంలో సంజయ్కుమార్ అరెస్టు చూపించి సంబంధిత కోర్టులో హాజరుపరుస్తామని అడ్వొకేట్ జనరల్ కార్యాలయం నుంచి సీజేకు సమాచారం అందింది. దీంతో ఇంటి వద్ద అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సీజే నిరాకరించారు. గురువారం సంబంధిత కోర్టులో తొలి కేసుగా విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. జస్టిస్ అభినంద్కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం బీజేపీ పిటిషన్ను గురువారం విచారించే అవకాశమున్నది.