High Court | హైదరాబాద్, మార్చి7 (నమస్తే తెలంగాణ): గవర్నర్లో కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ కేసీఆర్ మంత్రివర్గం చేసిన సిఫారసులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. గత ఏడాది సెప్టెంబర్ 19న గవర్నర్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గురువారం తీర్పు చెప్పింది. ప్రస్తుత రేవంత్రెడ్డి ప్రభుత్వం సిఫార్సు మేరకు ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్ను నియమిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం మేరకు వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 73 పేజీల తీర్పు వెలువరించింది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్కు సిఫారసు చేసింది. రాజకీయ నేపథ్యం ఉన్నదంటూ ఆ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరసరిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వేర్వేరుగా హైకోర్టులో సవాల్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గం తాజాగా జనవరి 13న కోదండరాం, ఆమిర్ అలీఖాన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ సిఫారసు చేసింది. ఈ సిఫారసును గవర్నర్ వెంటనే ఆమోదించడంతో ప్రభుత్వం జనవరి 27న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఓ వైపు తాము వేసిన పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే గవర్నర్ మరో ఇద్దరిని తన కోటాలో ఎమ్మెల్సీలుగా ఎలా నియమిస్తారని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు అంశాల మీద దాఖలైన పిటిషన్లపై సీజే ధర్మాసనం విచారణ జరిపి గురువారం తీర్పు వెలువరించింది.
మంత్రివర్గ సిఫార్సులు, సూచనలకు గవర్నర్ కట్టుబడి ఉండాలని, ఆ సిఫార్సులపై ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు వాటిని వెనకి పంపాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలుగా నియమించాలని మంత్రివర్గం చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడం చెల్లదని తేల్చి చెప్పింది. ‘దాసోజు శ్రవణ్కుమార్, కుర్ర సత్యనారాయణల నామినేషన్లను గవర్నర్ తిరసరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని పేర్కొంది. ‘ముందుగా ఈ రద్దు నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్ల నియామకాలకు విలువ ఉండదు. కాబట్టి వారిద్దరు దాఖలు చేసిన నామినేషన్లు చట్టప్రకారం చెల్లవు’ అని తెలిపింది.
‘పిటిషనర్లు ఇద్దరిపై క్రిమినల్ కేసులు, అనర్హతకు సంబంధించి నిఘా విభాగం సమర్పించిన నివేదికలు ఏమీ లేకపోయినా గవర్నర్ తిరసరణ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గం సిఫారసులను వెనకి పంపి సందేహాలను నివృత్తి చేసుకునేలా సంబంధిత సమాచారం, పత్రాలను గవర్నర్ కోరాలి. లేదా పునఃసమీక్షించాలని కోరాలి. ఈ విధంగా చేయని కారణంగా దాసోజు, కుర్రా నామినేషన్లను తిరసరిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. ఆ తర్వాత మంత్రివర్గం జనవరి 13న కోదండరాం, అలీఖాన్లను నియమించాలనే తీర్మానంతోపాటు వాళ్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గత జనవరి 27న వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ను కూడా రద్దు చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.
గవర్నర్కు న్యాయస్థానాలు ఉత్తర్వులు జారీ చేయలేవని హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని 361 అధికరణం ప్రకారం గవర్నరు కోర్టుకు జవాబుదారీకాదని తెలిపింది. ఈ కేసులోని పరిస్థితులు, వాస్తవాలను అనుసరించి గవర్నర్ తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని పేర్కొంది. సీఎం, క్యాబినెట్ సలహా లేకుండా గవర్నర్ సొంతంగా ఎప్పుడూ నిర్ణయం తీసుకునే అధికారం లేదని స్పష్టంచేసింది. గవర్నర్ తీసుకునే చర్యపై న్యాయసమీక్ష చేసేందుకు నిర్దిష్టమైన అడ్డంకులు ఏమీలేవని తెలిపింది. రాజ్యాంగంలోని 171(5) అధికరణ ప్రకారం గవర్నర్ మంత్రిమండలి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని పేర్కొంది. మంత్రివర్గం సిఫారసులను పునఃసమీక్షించాలని పేరొంటూ ఫైల్ను వెనకి పంపే అధికారం గవర్నర్కు ఉంటుందని తెలిపింది.
గవర్నర్ కోర్టులకు జవాబుదారీ కాదని, అంతమాత్రాన గవర్నర్ దురుద్దేశపూరిత, వ్యక్తిగత చర్యలు, నిర్ణయాలు తీసుకుంటే.. వాటిపై న్యాయ సమీక్ష చేసేందుకు కోర్టులకు అధికారం ఉంటుంది అని హైకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని 171(5) అధికరణ ప్రకారం సాహిత్యం, సైన్స్, ఆర్ట్స్, సహకార ఉద్యమం, సామాజిక సేవల్లో అనుభవం ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే అధికారం గవర్నర్కు ఉంటుందని వివరించింది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల మేరకు, రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం సలహాలు, సహకారంతోనే గవర్నర్ విధుల్ని నిర్వహించాలని, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీల్లేదని తెలిపింది.
‘గవర్నర్ సొంతంగా విచక్షణతో విధులు నిర్వహిస్తే అది చట్ట నిబంధనలకు అడ్డంకిగా ఉండకూడదు. ఎమ్మెల్సీలుగా మంత్రివర్గం చేసిన సిఫారసులను అన్ని పరిస్థితుల్లోనూ గవర్నర్ ఆమోదించాల్సిన బాధ్యత ఉండదు. మంత్రివర్గం సిఫార్సు చేసిన వాళ్లల్లో అనర్హులు ఉన్నారో లేదో సమీక్ష చేసే అధికారం గవర్నర్కు ఉంది. ఏమైనా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నా, ఆ వ్యక్తులు బెయిల్పై బయట ఉన్నా, తీవ్ర అభియోగాలు ఉన్న పరిస్థితుల్లో ఆ పేర్లను తిరిగి సమీక్ష చేయాలని సిపార్సులను మంత్రివర్గానికి వెనకి పంపవచ్చు’ అని పేర్కొంది.