హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): హౌసింగ్ బోర్డు ఉద్యోగులు 320 మందికి 1991 జూన్ 4న జారీ చేసిన జీవో 2 ప్రకారం ప్లాట్లు కేటాయించాలని హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ప్లాట్ల స్థానంలో ఫ్లాట్ల్ల కేటాయింపునకు 2008లో ప్రభుత్వం జారీచేసిన జీవోను కొట్టేసింది. ఏపీ హౌసింగ్ బోర్డు ఉద్యోగులకు కూకట్పల్లి ఫేజ్-4లోని సర్వే నంబర్ 1964, 1008లో 13 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గజం ధర రూ.45 గా నిర్ణయించింది. 320 మందిని ఎంపిక చేసి, లేఔట్ తర్వాత ధరను రూ.116 కు పెంచింది. తేడా మొత్తం రూ.71 చెల్లించాలని ఆదేశించింది. ఈ దశలో కేటాయింపులను నిలిపివేయాలని ప్రభుత్వం బోర్డును ఆదేశించింది. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. సవరించిన డబ్బును చెల్లించిన 107 మందికి ప్లాట్లు కేటాయించాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ విచారించి, కొట్టేసింది. ఉద్యోగులకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని, డబ్బు తీసుకున్నాక ప్రభుత్వం విధాన నిర్ణయాన్ని మార్పు చేస్తే డబ్బు చెల్లించిన వారి హకులు ఏం కావాలని ప్రశ్నించింది. 4 నెలల్లోగా స్థలాల కేటాయింపులు చేయాలని తీర్పు చెప్పింది.