హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో తెలంగాణను జాతీయ అవార్డు వరించింది. ఢిల్లీలో జరుగుతున్న ‘ఆరోగ్య మంథన్- 2022’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ‘ఆయుష్మాన్ ఉత్క్రిష్టత పురస్కార్’ను అందజేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలులో ‘పబ్లిక్ హెచ్ఎఫ్ఆర్ క్యాటగిరీ’లో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిం ది. ఏబీడీఎంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు ‘హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ’ (హెచ్ఎఫ్ఆర్) ఐడీలను కేటాయిస్తున్నది.
ప్రైవేట్ సంస్థలు సొంతంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వ వైద్యశాలల రిజిస్ట్రేషన్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. మొత్తం 50 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. కానీ రాష్ట్ర ప్రభు త్వం కేవలం 30 రోజుల్లోనే రాష్ట్రంలోని పీహెచ్సీలు మొదలు టీచింగ్ హాస్పిటళ్ల వరకు అన్ని హాస్పిటళ్లకు హెచ్ఎఫ్ఆర్ ఐడీలను కేటాయించింది. అతితక్కువ వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకున్నందుకు గుర్తింపుగా కేంద్రం జాతీయ అవార్డును అందజేసింది.