హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా నదిలో నీరు సమృద్ధిగా లేని సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతమే ఎకువగా నష్టపోతుందని, ఈ నేపథ్యంలో క్యారీఓవర్ స్టోరేజీలో ఎకువ వాటా పొందే అర్హత తెలంగాణకే ఉన్నదని సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ, తెలంగాణ తరఫు సాక్షి చేతన్ పండిట్ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు స్పష్టం చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంపై శుక్రవారం ఢిల్లీలో బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ కొనసాగింది. క్రాస్ ఎగ్జామినేషన్లో ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు చేతన్ పండిట్ను క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
ఏపీ పునర్విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఉనికిలోకి రావడంతో గతంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటి వాటా ఇప్పుడు అంతర్రాష్ట్ర అంశంగా, అంతర్-బేసిన్ సమస్యగా మారిందని పేర్కొన్నారు. అంతర్-బేసిన్ మళ్లింపుపై ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందాలు లేనందున నీటి కేటాయింపులో బేసిన్ లోపల ప్రాంతాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాతే అంతర్-బేసిన్కు ఇవ్వాలని సూచించారు. 25 ఏండ్లలో నీటి వాటాలో ఏర్పడే లోటును భర్తీ చేసేందుకే ఉమ్మడి ఏపీకి కేడబ్ల్యూడీటీ-1, కేడబ్ల్యూడీటీ-2 శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో మొత్తంగా 150 టీఎంసీల క్యారీఓవర్ స్టోరేజీకి అవకాశం కల్పించాయన్న ఏపీ వాదనతో చేతన్ పండిట్ విభేదించారు.
కృష్ణా డెల్టా నుంచి వృథాగా నీరు సముద్రంలోకి పోవడంతోపాటు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం, గోదావరి డైవర్షన్ మొదలైన వాటి నుంచి 80 టీఎంసీలు వస్తుండటం లాంటి మారిన పరిస్థితులను కేడబ్ల్యూడీటీ-2 గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు. 25 ఏండ్ల నీటి లోటును తీర్చడానికి మాత్రమే ట్రిబ్యునల్-2 ఏపీకి 150 టీఎంసీల క్యారీఓవర్ నిల్వను అనుమతించిందని తెలిపారు. నీటి లోటు ఏర్పడిన సంవత్సరాల్లో ఏపీ కన్నా తెలంగాణ ఎకువగా నష్టపోతున్నందున క్యారీఓవర్ నిల్వలో ఎక్కువ వాటా పొందే హక్కు తెలంగాణకే ఉన్నదని చేతన్ పండిట్ నొక్కి చెప్పారు. విచారణకు ఇరు రాష్ట్రాల సీనియర్ ఇంజినీర్లు, న్యాయవాదులు హాజరయ్యారు. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 1 నుంచి 3కు వాయిదా వేస్తున్నట్టు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్-2 ప్రకటించింది.