హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): అన్నిరంగాల్లో దేశంలోని కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ లాంటి పెద్దరాష్ట్రాల పోటీపడుతున్న తెలంగాణ ఫ్యాక్టరీల స్థాపనలో అద్భుతమైన ముందంజ సాధించింది. 13వ ర్యాంకు నుండి మొదటి మూడు ర్యాంకులకు ఎగబాకింది. 2012-13 సంవత్సరంలో మన రాష్ట్రంలో 13,656 ఫ్యాక్టరీలు ఉండగా 2019-20 నాటికి అవి 15,271కు పెరిగాయి.
ఈ ఫ్యాక్టరీల ఏర్పాటు ద్వారా ఇక్కడి నిరుద్యోగ యువతకు దండిగా ఉద్యోగ అవకాశాలతో పాటుగా పరోక్ష ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఫ్యాక్టరీల ద్వారా వచ్చే ప్రత్యక్ష ఆదాయం ఎంతో దోహదం చేస్తున్నది. ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి అనువైన వాతావరణం ఉండటంతో పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారు. టీఎస్బీపాస్ విధానంతో సత్వర అనుమతులు లభిస్తుండటం, ముడిసరుకు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటు లో ఉండటం రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఫ్యాక్టరీలు రావడానికి కారణమవుతున్నాయి.
సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో తెలంగాణ పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కినెట్టి ముందుకు సాగుతున్నది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కంటే ప్రతి సంవత్సరం మెరుగైన పనితీరును కనబరుస్తూ ఉత్తమమైన ర్యాంకులను సాధిస్తున్నది. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉన్నదని ఈవోడీబీ ద్వారా వెల్లడైంది. ఇక్కడున్న అనుమతుల విధానం, అనుమతుల మంజూరుకు వివిధ శాఖలు అనుసరిస్తున్న పద్ధతులను దీనిలో ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు.