Telangana | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): చిన్నారుల సంరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. బాలల రక్షణ విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. బాలల సంరక్షణ చర్యలపై ఇతర రాష్ర్టాలు తెలంగాణలో అధ్యయనాలు చేశాయి. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 6 నెలల నుంచి ఆరేండ్ల లోపు చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం పౌష్ఠికాహారం అందజేస్తున్నది. గిరిజన ప్రాంతాల్లో గిరిపోషణ, బాలామృతం, బాలామృతం ప్లస్ అందిస్తూ దేశం దృష్టిని రాష్ట్రం ఆకర్షించింది.
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న శిశువిహార్ పనితీరును కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ప్రతినిధి బృందం అధ్యయనం చేసింది. ఇక్కడ అనాథ పిల్లలకు అందుతున్న సేవలపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్), సపోర్ట్ అడ్వకసీ మెంటల్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ ఫర్ చిల్డ్రన్ ఇన్ వల్నెరబుల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ డిస్ట్రెస్ (సంవాద్) సంయుక్త ఆధ్వర్యంలోని బృందం అధ్యయనం చేసింది. ఈ తరహా నమూనాను దేశంలోని మిగతా రాష్ర్టాలు అనుసరించాలని సూచించింది.
శిశువిహార్లో ప్రస్తుతం ఉన్న 0-6 ఏండ్ల వయస్సుగల 200 అనాథ చిన్నారుల్లో 70కిపైగా ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నారు. మానసిక వైకల్యం, వయస్సుకు తగ్గ ఎదుగుదల లేకపోవడం, సరిగ్గా మాటలు రానివారు, వినికిడిలోపం ఉన్నవాళ్లు, శారీరక వైకల్యం ఉన్న ఈ ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం ఆరు గదులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించింది. ప్రత్యేక విద్య, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి సేవలు అందించే ప్రైమరీ రిహాబిలిటేషన్ సెంటర్ (పీఆర్సీ)తో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నదని నిమ్హాన్స్ ప్రత్యేకంగా అభినందించింది.
ఆపదలో ఉన్న చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వన్ స్టాప్ సెంటర్ దేశ ప్రసంశలు పొందింది. అన్ని జిల్లాల్లో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు చిన్నారుల రక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న అన్ని చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను ఒకే గొడుగుకు కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బాల రక్షక్భవన్లు ఏడాది సుమారు 12,000 మంది పిల్లలకు సేవలు అందిస్తున్నాయి. ఈ తరహా నమూనాలను ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాలు ఇప్పటికే అధ్యయనం చేశాయి. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ దీనిపై డాక్యుమెంటరీని రూపొందించే పనిలో నిమగ్నమైంది.
భారతదేశంలోనే తొలిసారిగా పిల్లల రక్షణ కోసం చైల్డ్ హెల్ప్లైన్ (1098)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. హెల్ప్లైన్ కాల్ రాగానే స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రతి జిల్లాకు జిల్లాకు అందించిన బాలరక్షక్ వాహనాలు చేరుకొని ఆపదలో ఉన్న పిల్లలకు అవసరమైన సేవలను అందిస్తున్నాయి. 2021 నవంబర్ 14న బాలరక్షక్ వ్యవస్థను ప్రారంభించారు. ఇప్పటివరకు 9,620 మంది చిన్నారులను రక్షించి, సహాయ చర్యలు అందించారు.
దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం, చట్టబద్ధమైన దత్తత ప్రక్రియలో తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయడానికి, సలహా సూచనలు ఇవ్వడానికి అడాప్షన్ హెల్ప్ డెస్క్ (దత్తత సహాయ కేంద్రం)ను ప్రారంభించింది. హెల్ప్డెస్ సేవలు వ్యక్తిగత సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్, 040-23748663/4లో టెలిఫోనిక్ కాల్స్ను స్వీకరించేందుకు కార్యాలయ పనివేళల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు.
సంరక్షణ అవసరమైన పిల్లల శ్రేయస్సు కోసం తెలంగాణ స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ పోర్టల్ (టీఎస్సీపీడబ్ల్యూ) పని చేస్తున్నది. 28 వేల మంది చిన్నారులను గుర్తించి సంరక్షించింది. సెప్టెంబర్ 2021 నుంచి ఇప్పటిదాకా ట్రాక్ అయిన 28 వేల మంది చిన్నారులతోపాటు వారి పూర్తి వివరాలు భద్రంగా ఉన్నాయి. ఈ పోర్టల్ను కేంద్ర స్త్రీశిశు సంక్షేమశాఖ అధ్యయనం చేసింది. ఈ విధానం అత్యద్భుతంగా ఉన్నదని ప్రశంసించి, జాతీయ స్థాయిలో ఈ తరహా పోర్టల్ను అభివృద్ధి చేస్తున్నది. టీఎస్సీపీడబ్ల్యూ పోర్టల్కు 2022-23 సంవత్సరానికి కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి ఈ-గవర్నెన్స్ అవార్డు లభించింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22(నమస్తే తెలంగాణ) : యంగ్ ఇన్నోవేటర్లకు బంపర్ ఆఫర్. వైజ్ఞానిక రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా యువ పారిశ్రామికవేత్తలకు నిధి ప్రయాస్ ద్వారా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ రూ.10లక్షల ప్రోత్సాహాకాలను ఇవ్వనున్నది. హెల్త్కేర్, బయోటెక్నాలజీ వంటి అనుబంధ రంగాల్లోని ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి, పది మంది యువ ఆంత్రపెన్యూర్లకు ఈ సాయం చేయనున్నది. ఇందుకు 18 ఏండ్లు నిండి ఆవిష్కరణలకు కృషి చేసే యువకులు, మహిళలు, స్టార్టప్ క్రియేటర్లు అర్హులు. ఈ ఆర్థిక సాయానికి వచ్చే నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు సీసీఎంబీ లోని ప్రయాస్ డెస్క్తోపాటు nidhiprayas@ccmb.res.in లేదా 040-27195626, 9000021386 సంప్రదించవచ్చు.
పిల్లల రక్షణ పెద్దల బాధ్యత. దురదృష్టవశాత్తు సమాజంలో ప్రత్యేక పరిస్థితుల పిల్లలున్నారు. అనాథలుగా మారినవారు. బలమైన కారణాలతో తల్లిదండ్రుల చేత వదిలివేయబడినవారు, తల్లీదండ్రీ ఇద్దరో.. ఇద్దరిలో ఎవరో ఒకరో కాలం చేయటం ద్వారా వారి ఆలనాపాలనా చూసుకునే పరిస్థితులు లేనివారు ఎంతోమంది ఉన్నారు. ఇలా వివిధ కారణాలతో ఉన్న పిల్లలకు అండగా ఉండటం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. సమాజంలో ఏ బిడ్డ ఇబ్బందులకు గురికాకూడదని సీఎం కేసీఆర్ అనేక శిశు సంరక్షణ చర్యలు చేపట్టారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. బాలల రక్షణ విషయంలో తెలంగాణ దేశానికి రోల్ మాడల్గా నిలవటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
– సత్యవతి రాథోడ్, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి