హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శమని, అవి సాధిస్తున్న విజయాలు మనందరికీ గర్వ కారణమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. కేజీ నుంచి పీజీ వరకు అన్నివర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే సీఎం కేసీఆర్ స్వప్నాలు సాకారమవుతున్నాయని స్పష్టంచేశారు. పది, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్సీ గురుకులాల విద్యార్థుల అభినందన సమావేశాన్ని మాసబ్ ట్యాంక్లోని ఎస్సీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని చెప్పారు. 5 సొసైటీల ఆధ్వర్యంలో 990 సూళ్లు అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో 75 సూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశామని వెల్లడించారు.
షేక్పేట, చిలుకూరు బాలుర, నార్సింగి, మహేంద్రహిల్స్ బాలికల సూళ్లను గౌలిదొడ్డి పాఠశాల మాదిరిగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం ఉత్తమ ఫలితాలను సాధించిన 28 మంది విద్యార్థులను నగదు పురసారాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా, సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంతునాయక్ తదితరులు పాల్గొన్నారు.