హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు జీఎస్డీపీ 11.7 శాతం పెరుగుదల నమోదైందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీ ప్రాథమిక అంచనాల వివరాలు, జీఎస్డీపీపై కొవిడ్ ప్రభావం, గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారా సమకూరిన జీఎస్డీపీకి సమకూరిన వాటాపై శాసన మండలి సభ్యుడు కే నవీన్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ క్యాలెండర్ ప్రకారం 2022 జులై కాలంలో 2021 -22 ఆర్థిక సంవత్సర ప్రకారం తాత్కాలిక అంచనాలు రూపొందించడం జరుగుతుంది. కొవిడ్ ప్రభావం జీఎస్డీపై ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధి 11.3 శాతం ఉండగా, 2020-21లో ప్రస్తుత ధరల్లో 2.4 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాలకు 20.5 శాతం వృద్ధిరేటు, ఐటీ రంగంలో 13.5 శాతం వృద్ధి రేటుకు తోడ్పాటునిచ్చాయి.
జీఎస్డీపీ పెరుగుదలకు ప్రభుత్వం చేపట్టిన వివరాలు..
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు, సాగు నీటి మౌళిక సదుపాయాలు మెరుగుపర్చి, 24 గంటల ఉచిత విద్యుత్, రాయితీతో నాణ్యమైన విత్తనాలు, రైతు బీమా,మత్స్య కారులకు ఉచిత చేప పిల్లలు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందించడం. గ్రామీణ ఆదాయం పెంచేందుకు పాడి పశువులు అందించడం, గొర్రెల పంపిణీ, లీటరు పాలుకు రూ.4పెంపు వంటివి ఆయా రంగాల వృద్ధికి దోహనం చేశాయి. పారిశ్రమిక రంగంలో స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ టీఎస్ ఐపాస్, పారిశ్రామిక భూమి బ్యాంకు ఏర్పాటు, ఫార్మా సిటీ, వైద్య పరికరాల పార్క్, ఫుడ్ ఫార్క్, ప్లాస్టిక్ పార్క్, టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు, నిరంతర నాణ్యమైన విద్యుత్తో పారిశ్రామిక వృద్ధికి తోడ్పడింది.
జీఎస్డీపీ ఎస్టిమేట్ సంవత్సరానికి అడ్వాన్స్ ఎస్టిమేట్గా తయారు చేస్తారు. ఐదుసార్లు ఇవి తయారుచేయడం జరుగుతుంది. ప్రైమరీ సెక్టార్ 24.1 శాతం రాష్ట్ర జీఎస్డీపీ పెరుదలకు దోహదపడూతుంది. సర్వీస్ సెక్టార్ 59.4 శాతం మన రాష్ట్ర జీఎస్డీపీకి వాటా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు దేశ జీడీపీలో మనం 4.06 శాతంగా ఉన్నాం. ఇది ఇప్పుడు ఐదు శాతం. దేశం జీడీపీ కన్నా.. రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉండటంతో మన రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదలతో పాటు దేశ జీడీపీని ప్రభావితం చేస్తున్నాం. మన కన్నా పెద్ద రాష్ట్రాలు దేశంలో ఉన్నాయి. భూవిస్తీర్ణంలో మన తెలంగాణ 13వ ,14వ స్థానంలో ఉన్నా దేశ సంపదను సమకూర్చే విషయంలో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జీఎస్డీపీ 11.7 శాతం పెరుగుదల నమోదైంది.
2014-15లో జీఎస్డీపీ 5లక్షల 5వేల 840కోట్లు ఉండగా.. ఈ రోజు 9లక్షల 80వేల 407 కోట్లుగా ఉంది. ఆరేళ్లలో 93.8 శాతం పెరగుదల నమోదు చేసింది. దేశంలో ఈ పెరుగుదల విషయంలో (జీఎస్టీడీపీ) మూడో స్థానంలో ఉంది. 2014-15లో దేశ జీఎస్డీపీ వృద్ధి రేటు 1 కోటి 24 లక్షల 67 వేల 950 కోట్లు ఉండగా.. 2020-21 ముగిసే నాటికి 1 కోటి 97 లక్షల 47 వేల 600 కోట్లుగా ఉంది. 58.4 శాతం వృద్ధి రేటుగా నమోదైంది. దేశంతో పోల్చితే మన తెలంగాణ వృద్ధి రేటు రెట్టింపుగా ఉంది. మన పని తీరుతో దేశ జీడీపీలో మన వాటా ఎక్కువగా ఉంది.
రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రాలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూర్చుతుంది. మన రాష్ట్రం రెవెన్యూ సర్ ప్లస్ రాష్ట్రం కావడంతో మన రాష్ట్రానికి ఎలాంటి నిధులు 15వ ఆర్థిక సంఘం ఇవ్వలేదు. కానీ, బాగా పని చేస్తున్న రాష్ట్రాలు నష్టపోవద్దు అని15వ ఆర్థిక సంఘం మూడు రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని సిఫారసు చేసింది. అందులో తెలంగాణ ఉంది. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సూచించింది. గత కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేసి నిధులు ఇచ్చేవారు. కానీ, తెలంగాణకు నిధులు ప్రత్యేకంగా ఇవ్వాలని సూచించినా కేంద్రం పట్టించుకోలేదు.జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైనప్పుడు నేను నిర్మలా సీతారామన్ను కలిసి గుర్తు చేసినా.. ఎలాంటి స్పందన లేదు. కేంద్ర విధానాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం.
నీతి ఆయోగ్ వంటి సంస్థలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని సూచించినా కేంద్రం సహకారం ఇవ్వలేదు. పోయిన ఏడాది జీఎస్టీలో పూర్తిగా కేంద్రం ఇవ్వలేదు. చాలా ఆలస్యంగా కొంత నిధులు ఇచ్చారు. జీఎస్టీ కాలపరిమితి ముగిసిన తర్వాత ఇవ్వాల్సిన మొత్తాన్ని దశలవారీగా ఇస్తామని చెప్పారు. కరోనా సాకు చూపి 2022 జీఎస్టీ కాలపరిమితి ముగిసిన తర్వాత ఇస్తామనడం వల్ల రాష్ట్ర పురోగతిపై తీవ్రప్రభావం చూపుతుంది. జీఎస్టీ పరిహారం బకాయిలున్నాయి. ఐజీఎస్టీ బకాయిలు రావాల్సి ఉంది. కరోనాతో దేశం, రాష్ట్రాలు నెగిటీవ్ గ్రోత్ నమోదు చేస్తే తెలంగాణ మాత్రం పాజిటీవ్ గ్రోత్ రెట్ నమోదు చేసింది.
30శాతం పీఆర్సీని కరోనా వచ్చినా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. కేంద్రం పదేళ్లకు పీఆర్సీ ఇస్తుంది. బీజేపీ ప్రభుత్వం 15 శాతం పదేళ్లకు ఇచ్చింది. ఐదేళ్లకు లెక్క గడితే 7.5 శాతం ఇచ్చింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం 30శాతం ఇచ్చింది. దీన్ని అభినందించాల్సి ఉంది. లాక్ డౌన్తో ఆదాయం పడిపోయింది. వ్యవస్థలు కుదుటపడుతున్నాయి. వెయ్యి కోట్ల రూపాయలు 30 శాతం పీఆర్సీతో ప్రభుత్వంపై ప్రతీ నెల భారం పడుతోంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వారికి ఎప్పూడూ జీతాలు పెంచే వారు కాదు. సీఎం కేసీఆర్ అడగకుండానే కాంట్రాంక్ట్, అవుట్ సోర్సింగ్, హననోరియం ఉద్యోగులకు 30 శాతం జీతాలు పెంచారు.
మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీలకు ఇన్సెంటీవ్ ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడిగారు. తప్పకుండా అందజేస్తాం. పాడిపశువుల గ్రౌండింగ్ త్వరగానే పూర్తి చేస్తాం. కర్ణాటక మంత్రి రేవన్న గొర్రెల పంపిణీ పథకం చూసి ప్రగతి భవన్ వచ్చి సీఎం గారికి గొంగడి కప్పి సన్మానించారు. ఈ పనిని అభినందించాల్సి ఉంది. పెరిగిన ధలకు అనుగుణంగా గొర్రెల యూనిట్ ధర లక్షా 75 వేలకు పెంచారు. దీన్ని తప్పుబట్టడం సరి కాదు.