హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : కోర్టు కేసు వాయిదాల పరంపర నేపథ్యంలో బదిలీలతో నిమిత్తం లేకుండా టీచర్లకు పదోన్నతులు కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పీఆర్టీయూ తెలంగాణ నేతలు గురువారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని హైదరాబాద్ శ్రీనగర్కాలనీలోని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
తొమ్మిదేండ్లుగా టీచర్ల పదోన్నతులు నిలిచిపోయాయని, పదోన్నతులు కల్పించడం ద్వారా ఎవరికి నష్టం కలగదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కావున, తక్షణమే పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చినవారిలో మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధానకార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మారెడ్డి అంజిరెడ్డి తదితరులు ఉన్నారు