దేశంలోని మొత్తం కెమెరాల్లో 61 శాతం ఇక్కడే
ఆర్థిక సర్వే- 2022లో వెల్లడి
హైదరాబాద్, మార్చి 7 : ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 8,51,644 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. దేశంలో అత్యధిక సీసీ కెమెరాలున్న రాష్ట్రం తెలంగాణేనని 2022 ఆర్థిక సర్వే తెలిపింది. మొత్తం సీసీ కెమెరాల్లో ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, నేను సైతం పథకంలో ఏర్పాటు చేసినవి 7,76,284 ఉన్నాయి. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ -2020 నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో 61.3 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. హాక్ ఐ మొబైల్ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇప్పటికే 5 లక్షల మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపింది. 2014 నుంచి 2020 వరకు 22, 347 మంది కానిస్టేబుళ్లను కొత్తగా నియమించినట్టు వెల్లడించింది.
షీ టీమ్స్కు 37,193 ఫిర్యాదులు
మహిళా భద్రత కోసం ఏర్పాటుచేసిన షీ టీమ్స్కు 2014 నుంచి 2021 వరకు 37,193 ఫిర్యాదులు అందగా, వివిధ సెక్షన్ల కింద 22,574 ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. 2020లో 4,687, 2021 నవంబర్ వరకు 5,145 ఫిర్యాదులు అందాయి. జైళ్ల సంస్కరణల్లో భాగంగా ఈ-ములాఖత్ సదుపాయం ఏర్పాటుచేసి ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు వీడియో కాన్ఫెరెన్స్లో మాట్లాడే సదుపాయం కల్పించారు. జైళ్ల ఆవరణలో హరితహారం ద్వారా 3 లక్షల మొక్కలు నాటినట్టు సర్వే తెలిపింది.