Helpline | ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ నివసిస్తున్న.. పర్యటనలో ఉన్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి వచ్చిన సమాచారం మేరకు.. ఇప్పటి వరకు తెలంగాణ చెందిన ఎవరూ ప్రభావితమైనట్టు సమాచారం అందలేదు. అయితే, భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సహాయం కోసం పీఎస్ రెసిడెంట్ కమిషనర్ వందన, (+91 9871999044) లైజన్ ఆఫీసర్లు జి రక్షిత్ నాయక్ (+91 9643723157), జావేద్ హుస్సేన్ (+91 9910014749), పౌర సంబంధాల అధికారి పీహెచ్ చక్రవర్తి (+91 9949351270)ని సంప్రదించాలని అధికారులు సూచించారు.