హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది చిన్న, మధ్య తరహా పారిశ్రామికవాడలు రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి వీటిలో పనులు మొదలవుతాయని పరిశ్రమలశాఖ అధికారులు వెల్లడించారు. వీటితోపాటు ఇప్పటికే కొనసాగుతున్న మరో 12 పార్కులను టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అప్గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెద్ద ఎత్తున కృషిచేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఈ) ఏర్పాటు ద్వారా జిల్లాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఎనిమిది ఎంఎస్ఈ పార్కులను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కొక్క పార్కు సుమారు 50-60 ఎకరాల్లో ఉంటుంది. ఈ పార్కుల పనులు తుది దశకు చేరుకొన్నాయి. రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులు పూర్తికావచ్చినట్లు అధికారులు తెలిపారు. అప్గ్రేడ్ చేయనున్న 12 పార్కుల్లో ఒక్కో దానికి రూ.10 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి నిధుల విడుదలకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. అప్గ్రెడేషన్లో భాగంగా ఉద్యోగులకు నైపుణ్యశిక్షణ, అదనపు మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. కొత్త పార్కుల్లో వేలమందికి అవకాశాలు లభిస్తాయి.
ప్రతిపాదిత 8 పార్కుల్లో బుగ్గపాడు, కల్లెం, నర్మాల, కుందన్పల్లి తదితర పార్కులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన పార్కుల్లో పనులు తుదిదశకు చేరుకొన్నాయని పరిశ్రమలశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. వచ్చే జనవరిలో ఇవన్నీ కార్యాచరణలోకి వస్తాయన్నారు. అప్గ్రేడ్ చేయనున్న 12 పారిశ్రామికవాడలకు సంబంధించిన నిధులను కేంద్రం ఆమోదించిన వెంటనే నైపుణ్య శిక్షణ కేంద్రాలు, అదనపు మౌలిక వసతుల కల్పన పనులు మొదలవుతాయని పేర్కొన్నారు.