హైదరాబాద్ : పుడమి రక్షణ కోసం ఇషా పౌండేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎంచుకున్న మార్గం భావి తరాలకు ఆదర్శంగా నిలవబోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మట్టిని రక్షించు కార్యక్రమానికి నిరంజన్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సేవ్ సాయిల్పై ఈషా ఫౌండేషన్ తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
మట్టి మనషులం అయినా మనం ఈ నేలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నేల లేనిదే జీవం లేదన్నారు. భూమిని కాపాడితేనే జీవులు కూడా కాపాడబడుతాయన్నారు. 30 శాతం భూమి ఎడారిగా మారిందన్నారు. భూమిని కాపాడుకోకపోతే మనషులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. అభివృద్ధి, టెక్నాలజీ పేరుతో నేలను విధ్వంసం చేస్తున్నారు. రాజకీయ కర్తవ్యం ద్వారానే ధరిత్రిని కాపాడుకోగలమని స్పష్టం చేశారు. వ్యవసాయంలో రసాయనాలు తగ్గించాలి. లేదంటే భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
తెలంగాణ తొలి కేబినెట్లోనే ప్రకృతి పరమైన నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో 250 కోట్ల మొక్కలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగా హరితహారం చేపట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. నీరు లేని నేల ఎడారిగా మారుతుందని భావించి, సముద్రంలో కలిసే నీటిని ప్రాజెక్టుల ద్వారా ఒడిసి పడుతున్నామని పేర్కొన్నారు. భూగర్భ జలాలను పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. తెలంగాణ నేలంతా పచ్చబడ్డదని తెలిపారు. భావి తరాలకు ఆహార భద్రత, మంచి పర్యావరణాన్ని అందించడం మన అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఇషా ఫౌండేషన్కు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.