హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వర్సిటీ టీచర్ల పదవీ విరమణ వయస్సును త్వరలో పెంచనున్నారు. ఇందుకు ప్రక్రియను సర్కారు వేగవంతంచేసింది. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో 942 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును గతంలోనే 58 నుంచి 61 ఏండ్లకు పెంచిన సర్కారు గత మార్చి నుంచి అమలుచేస్తున్నది. వర్సిటీల్లోని అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లతోపాటు ప్రొఫెసర్లు ప్రస్తుతం 60 ఏండ్లకు పదవీ విరమణ పొందుతుండగా, పొడగించాలని విజ్ఞప్తులు వచ్చాయి. యూజీసీ నిబంధనల ప్రకారం వర్సిటీ టీచర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లు. ఇది కేంద్రం నిధులతో నడుస్తున్న వర్సిటీలతోపాటు సాంకేతిక విద్యాసంస్థలన్నింటిలో అమలవుతున్నది. యూజీసీ నిబంధనలను మన వద్ద సైతం అమలుచేయాలని కొంతకాలంగా యూనియన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనిపై కసరత్తును వేగవంతం చేసిన సర్కారు, వయోపరిమితి ఎంత పెంచితే ఎంత మందికి లాభం కలుగుతుందో నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. అధికారులు మూడు ప్రతిపాదనలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఏడాది పొడగించి అంటే 61 ఏండ్లుచేస్తే 34 మంది టీచర్లకు లబ్ధిచేకూరుతుందని, 63 ఏండ్లకు పొడగిస్తే 62 మందికి, 65 ఏండ్లకు పొడగిస్తే 141 మంది టీచర్లకు మేలు కలుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. రాబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.