హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): యువతకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 80,039 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా దశలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ఇప్పటికే 49,428 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా మరో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్స్) గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.inను సంప్రదించాలని సూచించింది. తాజా నోటిఫికేషన్తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 49,481 పోస్టులకు అనుమతి లభించింది.
ఏఎంవీఐ దరఖాస్తు స్వీకరణ తేదీ వాయిదా
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రవాణాశాఖలో 113 సహాయ మోటరు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. నోటిఫికేషన్ ప్రకారం శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉన్నది. అయితే సాంకేతిక కారణాలతో దరఖాస్తుల స్వీకరణ తేదీని వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. దరఖాస్తు స్వీకరణ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపింది.