హైదరాబాద్ : సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని, అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధితోపాటు వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి అన్నారు. భూమిక ఉమెన్స్ కలెక్టివ్, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లింగ సమానత్వం ద్వారా మహిళా సాధికారత అనే అంశంపై సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ హోటల్లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందని ఆమె చెప్పారు. ఆడపిల్ల చదువు ఇంటికి సమాజానికి వెలుగు అని అన్నారు. సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా మహిళల ఆరోగ్యం, సంక్షేమం పట్ల అనేక పథకాలు చేపట్టిందని స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన భోజన వసతి, విద్య కల్పించారని తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ నిధి ద్వారా విదేశీ చదువులకు 20 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తోందని గుర్తు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆడపిల్లల వివాహాలకు ఆర్ధిక మనోబలం కల్పించారని, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్స్ ద్వారా మాతా శిశువులకు ఆరోగ్య, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, మహిళల ఆలోచనలకు అనుగుణంగా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని చైర్ పర్సన్ తెలిపారు. దేశంలోనే ప్రథమంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరీక్షించడమే కాకుండా వారికి రక్షణగా మహిళా కమిషన్ నిలుస్తుందన్నారు. ఆడ మగ అంటూ బేధాభిప్రాయంతో పిల్లలను పెంచకూడదని సమన హక్కు కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి మీద ఉందన్నారు. కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. అదే విధంగా చదువులో కానీ ఏ రంగంలో కానీ లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మించుకోవాలని కోరారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయ అవరణలోనే ‘షీ క్యాబ్స్’ పథకం ద్వారా ఎంత మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు.
మహిళల హెల్ప్ లైన్ 198 లేదా పోస్టల్, ట్విట్టర్, ఇ మెయిల్ తదితర మార్గాల ద్వారా లేదా కమీషన్ నెంబర్ 9490555533 కు మహిళలు సమస్యలను తెలుపవచ్చునని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, మహిళా కమిషన్ సెక్రెటరీ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.