హైదరాబాద్, డిసెంబర్5 (నమస్తే తెలంగాణ): ‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. మహాత్మా జ్యోతిబా ఫులె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బలంగా నమ్మిన మాటలివి. అందుకే వారు అట్టడుగువర్గాల విద్యాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేశారు. ఆ మహనీయుల మార్గంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.
ఉమ్మడి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ విద్యారంగంపై రాష్ర్టావిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అట్టడుగువర్గాలకు కేజీ టు పీజీ వరకు ఉచితంగా, నాణ్యమైన విద్యను అందించాలన్నది ఆయన కల. ఆ దిశగా గడిచిన 8 ఏండ్లుగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు విద్యావిప్లవాన్ని సృష్టిస్తున్నాయి. ఉచితంగా ఉన్నతవిద్యను పొందిన చోటునుంచే అత్యుత్తమ కొలువులను అందుకునే స్థాయికి ప్రభుత్వ గురుకులాలు చేరుకుంటున్నాయి. అట్టడుగువర్గాల విద్యార్థుల జీవితాల్లో వెలుగు రేఖలను ప్రసరింపజేస్తూ, సరికొత్త సామాజిక నిర్మాణానికి పునాది వేస్తున్నాయి.
అనేకమంది విద్యార్థులు ఏకకాలంలో డిగ్రీ పట్టాతోపాటు జాబ్ అపాయింట్మెంట్ లెటర్లను అందుకుంటుండటం విశేషం ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర రెసిడెన్షియల్ పాఠశాలలన్నీ కలిపి 298 ఉండేవి. అందులోనూ కేవలం 5 నుంచి 10 తరగతి వరకే విద్య లభించేది. ఇంటర్ కాలేజీలు వేళ్లమీద లెక్కపెట్టేస్థాయిలో ఉండేవి. డిగ్రీ గురుకులాల ఊసే లేదు. వసతులూ నామమాత్రమే. హాస్టళ్లు ఉన్నా విద్యార్థుల్లేక లేక అవి బోసిపోయే దుస్థితి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారీగా గురుకుల పాఠశాలలను 2016-17 నుంచి క్రమానుగుతంగా విస్తరించుకుంటూ వస్తున్నారు. తొలుత నియోజకవర్గానికి ఒకటి చొప్పున నెలకొల్పి, 2019లో మరోసారి హాస్టళ్లను సంఖ్యను పెంచారు. ఇలా మొత్తంగా 268 ఎస్సీ, 182 ఎస్టీ, 204 మైనార్టీ, 310 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పారు. మొత్తంగా రాష్ట్రంలో గురుకులాల సంఖ్య 1001కి చేరింది. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన వాటిలో 597 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసింది. వచ్చే విద్యాసంవత్సరంలో మిగిలిన గురుకుల పాఠశాలల కూడా కళాశాలలుగా అప్గ్రేడ్ చేయనున్నది.
ఉమ్మడి పాలనలో కేవలం ఒకే ఒక గురుకుల డిగ్రీ కళాశాల అందుబాటులో ఉండగా, నేడు 68 డిగ్రీ కళాశాలలను నెలకొల్పింది. సగటును ఒక్కో గురుకులం ద్వారా 640 మంది చొప్పున దాదాపు 6.40 లక్షల మందికిపైగా విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనంతోపాటు, మెరుగైన శిక్షణను అందిస్తున్నది. ఏటా ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తుండడం గమనార్హం.
మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా, సత్వరమే ఉపాధి అవకాశాలు పొందగల కోర్సులను తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో ప్రవేశపెడుతున్నది. సంప్రదాయ కోర్సులకు అదనంగా నూతన సాంకేతిక కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్మీడియట్ స్థాయిలో వొకేషనల్లో అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, హోమ్సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులకు ప్రవేశపెట్టింది. ఇక డిగ్రీ కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లర్నింగ్, బీబీఏ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియాలజీ, బిజినెస్ అనలిటిక్స్, జియోగ్రఫీ, డేటాసైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఫుడ్-న్యూట్రిషన్ అండ్ డైట్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ తదితర అధునాతన కోర్సులను అందుబాటులోకి తెచ్చింది.
గురుకులాల్లో మెరుగైన విద్యను అందించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సైతం తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. విషయ నిపుణులను తీసుకువచ్చి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్స్కిల్స్ వంటి వాటిపై శిక్షణ ఇప్పిస్తున్నది. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే వివిధ పోటీపరీక్షలకు అవసరమైన శిక్షణను ఇస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు డాటాసైన్స్, జావా తదితర అంశాల్లో తర్ఫీదునిస్తున్నారు. సాయంత్రం వేళ ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్, న్యూమరికల్-మెంటల్ ఎబిలిటీ, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను నిర్వహిస్తూ మాక్ ఇంటర్వ్యూలను, క్విజ్ పోటీలతో విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దుతున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థినులకు వేసవి సెలవుల్లోనూ ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉన్నత భవితకు బాటలు పరుస్తున్నారు. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, మాస్ మ్యూచువల్స్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు కళాశాలకే వచ్చి ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు 100మందికి పైగా విద్యార్థినులు ఉద్యోగాలను సాధించగా, ఇటీవలే కాగ్నిజెంట్, మాస్ మ్యూచువల్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మరో 50మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగావకాశాలను పొందారు. డిగ్రీ పట్టా చేతికి వచ్చిరాగానే లక్షల ప్యాకేజీతో కొలువుల్లో చేరుతుండడం విశేషం.
ఈ చిత్రంలో ల్యాప్టాప్పై పనిచేస్తున్న యువతి పేరు ఆలకుంట్ల శిరీష. సొంతూరు భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కొండంపేట. 12 ఏండ్ల వయసులోనే తండ్రి వెంకన్న కన్నుమూయగా, తల్లి ప్రమీలకు కూలిపనులే ఆధారమయ్యాయి. టీఎస్ఆర్జేసీ( వికారాబాద్)లో ఇంటర్ పూర్తిచేసిన శిరీష.. భువనగిరి గురుకులంలో డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవల ‘మాస్ మ్యూచువల్ ఇండియా’ నిర్వహించిన ప్లేస్మెంట్స్లో ఐదంకెల వేతనంతో కొలువు కైవసం చేసుకుంది. ఇన్నాళ్లూ ఒంటిచేత్తో ఇంటిభారాన్ని మోస్తూ వచ్చిన అమ్మకు అండగా, తోబుట్టువులకు ఆసరాగా మారింది. ఇది ఆమె ఒక్కరి విజయమే కాదు. నందిని, రాజేశ్వరి, నిఖిత, శిల్ప.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో దినసరి రోజుకూలీల బిడ్డలు.. గుమస్తాల పిల్లలు.. పేదింటి పిల్లలు ప్రభుత్వ ప్రోత్సాహంతో భవితకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఆవిష్కరిస్తున్న అద్భుత దృశ్యమిది.
మాది వరంగల్ జిల్లా గీసుగొండ మండలం విశ్వనాథపురం. ఐదు తరగతిలో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. డిగ్రీ భువనగిరి ఆర్మ్డ్ ఫోర్సెస్ గురుకుల కాలేజీలో సీటు వచ్చింది. కాలేజీలో చేరాక నా జీవితం మారిపోయింది. గురుకులంలో చదవడం ఓ వరం. ఇక్కడ చేరాకే సమాజంపై అవగాహన పెరిగింది. ఇటీవల మాస్మ్యూచువల్స్ ఇండియాలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. చాలా సంతోషంగా ఉంది. అధ్యాపకులకు, సీఎం కేసీఆర్కు నా కృతజ్ఞతలు.
– రాజేశ్వరి, ఎస్సీ డిగ్రీ గురుకులం (భువనగిరి ఆర్మ్ ఫోర్సెస్ కాలేజీ)
మాది భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి. వ్యవసాయ కుటుంబం. వర్గల్ గురుకులంలో డిగ్రీ పూర్తి చేశాను. అక్కడికి వెళ్లిన తరువాత నా జీవితమే మారిపోయింది. బాలికలకు, వెనకబడిన వర్గాలకు అదొక వరం. విద్యతోపాటు అదనంగా స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించారు. డాటాసైన్స్ క్యాంప్లను ఏర్పాటు చేస్తూ ఉద్యోగ సాధనకు దోహదపడే విషయాలపై శిక్షణ ఇస్తున్నారు. అందువల్లే ఇటీవల కాగ్నిజెంట్ కంపెనీ నిర్వహించిన ప్లేస్మెంట్లో ఎంపికయ్యా. ఇంత గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు నా కృతజ్ఞతలు.
-మేఘన, వర్గల్ గురుకుల డిగ్రీ కళాశాల
మాది నిర్మల్ జిల్లా కుంటాల మండలం బైనల్లి. మా ఊళ్లో సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు. పదేండ్ల వయస్సులోనే నాన్న చనిపోయారు. అమ్మ రేణుక బీడీ వర్కర్. ఇంటర్ టీఎస్ మాడల్ స్కూల్లో చదివిన నేను డిగ్రీ కోసం ఆదిలాబాద్ డిగ్రీ గురుకులంలో చేరాను. సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఏటా నిర్వహించే డాటా సైన్స్కు ఎంపికయ్యా. ఇటీవల మాస్ మ్యూచువల్స్ ఇండియాలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-సంగీత, ఎస్సీ డిగ్రీ గురుకుల కళాశాల,పూర్వ విద్యార్థిని (ఆదిలాబాద్)
రాష్ట్రంలో వెనకబడిన తరగతుల విద్యాభివృద్ధికి నిర్మాణాత్మకమైన అడుగులు పడుతున్నాయి. ప్రారంభించిన అనతి కాలంలోనే గురుకులాలు అత్యుత్తమ ప్రతిభను చాటుతున్నాయి. కేవలం మూడేండ్లలోనే అనితర సాధ్యమైన మైలురాళ్లను చేరుకోగలిగాం. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన విద్యను అందించేందుకు ప్రణాళికలను సిద్ధంచేశాం. క్రమంగా విద్యావకాశాలను మరింతగా పెంచేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు బీసీల పక్షాన నా కృతజ్ఞతలు.
-మంత్రి గంగుల కమలాకర్
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ లో నూతన విద్యావిప్లవం వెల్లివిరుస్తున్న ది. గురుకులాలు అద్భుత విజయాలకు, అనితర సాధ్యమైన ప్రతిభాపాటవాలకు చిరునామాగా నిలుస్తున్నాయి. ఉన్నతవిద్యను అందించడంతోపాటు, ఉత్తమ కొలు వులను సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. అట్టడుగువర్గాల పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు, అత్యున్నతస్థాయికి వెళ్లేందుకు బాటలు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాలు, నిర్ణయాల వల్లే ఈ ఫలితాలు. అందుకు ఆయనకు నా ధన్యవాదాలు.
-మంత్రి కొప్పుల ఈశ్వర్