చిక్కడపల్లి, ఏప్రిల్ 4: అన్ని వర్గాల మాదిరిగానే ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటుచేస్తామని భరోసా ఇచ్చారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ట్రాన్స్ ఉత్సవం-2023లో మంత్రి కొప్పుల మాట్లాడారు.
తొలిసారిగా ట్రాన్స్ ఉత్సవం నిర్వహించుకోవడం అభినందనీయని తెలిపారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం రాష్ట్రంలో 19 మంది సభ్యులతో సంక్షేమ బోర్డును ఇప్పటికే ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 58 వేల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. లింగ మార్పిడి కోసం కొన్ని దవాఖానల్లో ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్టు వెల్లడించారు. సమాజంలో ట్రాన్స్జెండర్లు కూడా భాగమేనని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పేర్కొన్నారు.