ఘట్కేసర్, ఏప్రిల్9: తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్లో గౌడసంఘం ఆధ్వర్యంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో పాపన్నగౌడ్లాంటి పోరాటయోధులకు సముచిత గౌరవం దక్కుతున్నదని చెప్పారు.
పాపన్నగౌడ్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పాపన్న గౌడ్ ఆశయాలతోనే సీఎం కేసీఆర్ వృత్తి పన్ను రద్దు చేశారని తెలిపారు. దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు రిజర్వేషన్ కల్పించారని, 63 వేల మంది గీత కార్మికులకు ప్రతినెలా రూ.2 వేల ఆసరా పింఛన్ అందజేస్తున్నట్టు చెప్పారు. గౌడ సంఘం రాష్ట్ర భవనానికి సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు కేటాయించారని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నీరాకేఫ్లను ప్రారంభిస్తామని వెల్లడించారు.
అన్ని వర్గాలను ఆదరిస్తున్న కేసీఆర్: మంత్రి చామకూర మల్లారెడ్డి
రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అన్ని కుల సంఘాల భవనాలకు స్థలం కేటాయించి, నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. కులవృత్తుల బలోపేతానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి జోగు రమేశ్, మాజీ ఎమ్మేల్యే సుధీర్రెడ్డి, గౌడ సంఘం నాయకులు జైహింద్గౌడ్, బాల్రాజ్గౌడ్, నక్క ప్రభాకర్గౌడ్, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు బీ శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్రెడ్డి, పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, ఘట్కేసర్ రైతు సే వా సహకారం సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి రాంరెడ్డి, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.