హైదరాబాద్, ఏప్రిల్2 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది 4.5 లక్షల మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేస్తున్నట్టు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసీవుల్లాఖాన్ వెల్లడించారు. నాంపల్లి హజ్ హౌస్ నుంచి అన్ని జిల్లాలకు గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ కార్యక్రమాన్ని మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ షఫీయుల్లాతో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం మసివుల్లాఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏటా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద కుటుంబాలకు దుస్తులతోపాటు గిఫ్ట్ ప్యాక్లను అందజేస్తున్నదని వివరించారు.
ఒక్కో కమిటీకి 500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 815 మసీదు మేనేజింగ్ కమిటీలకు గిఫ్ట్ ప్యాకెట్లను, ఇఫ్తార్వింధు కోసం రూ.ఒక లక్ష చొప్పున నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. నిరుపేదలందరూ రంజాన్ పండుగను జరుపుకునేందుకు ఈ పథకాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సీఈవో ఖాజా మొయినుద్దీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.