షాబాద్, జూన్ 24: రాష్ట్రవ్యాప్తంగా 63.25 లక్షల మంది రైతులకు గాను రూ.7,508 కోట్ల పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 60.77 లక్షల మంది రైతులకు రూ.7,299 కోట్ల సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడ గ్రామ సమీపంలోని గంగోత్రి గో నిలయంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి గోవులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో నేడు సాగవుతున్న 1.51 కోట్ల ఎకరాల భూమికి రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు చెప్పారు. 20 ఎకరాలకు మించి ఈ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులు కేవలం 6 వేల మంది మాత్రమేనన్నారు. మండలానికి ఇద్దరు, ముగ్గురు రైతులు మాత్రమే 50 ఎకరాలకు మించి భూమి ఉన్నట్టు వెల్లడించారు. రైతు పొలంలో పండించే పంట, సంపద సమాజానికి చెందుతుందనే సదుద్దేశంతో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది రైతుల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేశామన్నారు.