హైదరాబాద్ : దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో శ్రీనివాస్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేటు 0.7 శాతం నుంచి 2 శాతానికి పెరిగిందని తెలిపారు. తెలంగాణలో దాదాపు 10 వారాల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 100 దాటిందని చెప్పారు. తెలంగాణలో కేసుల సంఖ్య 355 నుంచి 555కు పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 811 కేసులు యాక్టివ్గా ఉన్నాయని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దాదాపు 8 వారాలుగా ఒక్క కొవిడ్ మరణం నమోదు కాలేదన్నారు. మరో 4-6 వారాల పాటు కేసుల సంఖ్యలో పెరుగుదల ఉండొచ్చని చెప్పారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. ప్రజలు సహకరించకపోతే మరోసారి మాస్క్ ధరించని వారికి ఫైన్ వేసే పరిస్థితులు వస్తాయన్నారు. రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు.