రాజ్భవన్ సాక్షిగా.. గణతంత్ర దినోత్సవంలో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం మరోసారి గవర్నర్ల వ్యవస్థపై తీవ్రమైన చర్చకు దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి దిగుతున్నట్టు ఆమె ప్రసంగం వింటే స్పష్టమవుతున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఖమ్మం సభలో అన్నట్టు.. ‘గవర్నర్ పలుకులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రకటన’గా భావించాలా? అనే అనుమానం తెలంగాణ ప్రజల్లో మొదలైంది.
ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన ప్రభుత్వం పట్ల గవర్నర్ వ్యవహరించే తీరును ప్రతి పౌరుడు, రాజకీయ పార్టీలు గమనించాలి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కనీసం చెప్పడానికి కూడా గవర్నర్కు మనసు రాలేదు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా దృష్టిలోపం ఉన్న ప్రజలందరికీ కంటిపరీక్షలు చేస్తున్న తీరు గవర్నర్కు కనపడలేదా? కోట్లాది మంది ప్రజలు కంటివెలుగు ద్వారా లబ్ధి పొందుతుంటే కనీసం ఆ విషయం ప్రస్తావనకు తీసుకురాకపోవడం గవర్నర్ దృష్టిలోపంగా భావించాలి. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ నాయకులు చేస్తున్న ప్రసంగాలను గవర్నర్ మరొకసారి రాజ్భవన్లో వినిపించడం దేనికి సంకేతం. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులున్నాయనే అభూత కల్పనలను గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. తద్వారా భవిష్యత్తులో తెలంగాణ పట్ల కేంద్రం అనుసరించే అప్రజాస్వామిక ప్రమాద ఘంటికలు తేటతెల్లమయ్యాయి.
తెలంగాణలో గత తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో శాంతిభద్రతలు మెరుగైనట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. సుస్థిరపాలన, శాంతిభద్రతల అమలు వల్ల వేలాది పరిశ్రమలు హైదరాబాద్కు తరలిరావడం నిజం కాదా? ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగే తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయా? మనుషుల మధ్య, మతాల మధ్య, విభజన సృష్టించి విధ్వంస రాజకీయాలు అమలుచేయాలని మతతత్వ పార్టీలు చూస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల మధ్య గంగా జెమునీ తెహ్జీబ్ సంస్కృతిని కొనసాగిస్తున్నది. ఇటీవల అనేక బహుళజాతి పారిశ్రామికవేత్తలు హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టడానికి ముందుకురావడం శాంతిభద్రతల సమస్యలుగా చూడాల్నా? దీనికి గవర్నర్ సమాధానం చెప్పాలి. జాతీయ సగటు కంటే ఎక్కువగా జీఎస్డీపీ సాధించడం తెలంగాణ ప్రభుత్వ విజయం. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తలసరి ఆదాయం మిగతా అన్ని రాష్ర్టాల కంటే మెరుగైనదని కేంద్రం ప్రకటించిన లెక్కలే చెప్తున్నాయి.
2014 -15లో రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ 21-22 నాటికి రూ.11.48 లక్షల కోట్లకు చేరడం గవర్నర్కు తెలియదా? దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం నుంచి 21-22 నాటికి 4.9 శాతానికి పెరగడం తెలంగాణ అభివృద్ధికి సూచిక కాదా? అభివృద్ధి అంటే కేవలం భవనాల నిర్మాణమని తెలంగాణ ప్రభుత్వం ఏనాడూ చెప్పలేదు. దానితోపాటు గత తొమ్మిదేండ్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుచేయడం వల్లనే ఇలాంటి ప్రగతి సాధ్యమైందని తెలియదా?
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందువరసలో నిలబడి కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు పొందిన విషయం తెలియకపోవడం రాజకీయ దృష్టిలోపం కాదా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని, పోరాటాన్ని పార్లమెంట్లో, బహిరంగ సభల్లో ప్రధానమంత్రి కించపరిచినప్పుడు గవర్నర్ స్పందించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే గవర్నర్కు తెలంగాణ ప్రజలు నీరాజనం పట్టేవారు.
రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఉల్లంఘిస్తున్న కేంద్రానికి ఒక లేఖ రాసి ఉంటే గవర్నర్కు గౌరవం పెరిగేది. ‘నీతి ఆయోగ్’ ప్రతిపాదించిన రూ.25 వేల కోట్లు ‘మిషన్ భగీరథ’, ‘మిషన్ కాకతీయ’ పథకాలకు ఇవ్వకుండా కేంద్రం ఎగవేసినప్పుడు గవర్నర్ తెలంగాణ పక్షాన మాట్లాడి ఉంటే ప్రజలు హర్షించేవారు. గవర్నర్ వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగి ఉండేది.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావలసిన నిధులను ఇవ్వకుండా వేధిస్తున్నది. ఈ విషయంలో ఒక్కమాట మాట్లాడని గవర్నర్ తెలంగాణ ఆత్మగౌరవం అభివృద్ధిపై మాట్లాడటం కేవలం రాజకీయ దురుద్ధ్దేశంతోనే కూడుకున్నదని అందరి అభిప్రాయం.
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, మార్కెటింగ్ సౌకర్యం, రైతు కల్లాల వంటి ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఆ కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలా జరుగుతున్నది. రైతులు వ్యవసాయ క్షేత్రాల్లోనే నివాసం ఉండి సాగు చేసే పరిస్థితి నేడు తెలంగాణలో ఉన్నది. పంటల దిగుబడి పెరిగి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానానికి చేరుకున్నది. బహుశా ఇది గవర్నర్కు గిట్టలేదేమో. ఫార్మర్హౌజ్ను ఫామ్హౌజ్ సంస్కృతిగా మార్చి ప్రశ్నించడం విచారకరం.
వేల మంది తెలంగాణ విద్యార్థులు ప్రభుత్వం ఇస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్లతో విదేశాలకు వెళ్తూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. పేద విద్యార్థులు ప్రతిభావంతులుగా తయారుకావడం గవర్నర్కు అభివృద్ధి నిరోధకంగా కనిపించడం బాధాకరం. వైద్య విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్య ద్వారా లక్షల మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నది. ఇది ఓర్వలేని గవర్నర్ కేవలం ప్రధాని మోదీ దగ్గర మెప్పు పొందడం కోసమే తెలంగాణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఆమెకు సరికాదు. ఇది ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలపై బురద చల్లడం కాదా? రాబోయే రోజుల్లో బీజేపీకి తెలంగాణలో స్థానం ఉండదేమోనని గవర్నర్ పడుతున్న ఆవేదనగా కనపడుతున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాల్లో లోపాలుంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం, అధికారం గవర్నర్కు ఉంటుంది. కానీ, గవర్నర్ తమిళిసై అలా చేయకుండా గణతంత్ర దినోత్సవం రోజున ఇలా బహిరంగంగా రాజకీయ విమర్శలకు దిగడం విజ్ఞత అనిపించుకోదు.
రాజ్యాంగ ప్రతినిధులుగా ఉండాల్సిన గవర్నర్లు పార్టీ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. ఇది తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీ, బెంగాల్, కేరళ, తమిళనాడు, బీహార్, పంజాబ్ రాష్ర్టాల్లోనూ ఇదే విధానం కొనసాగుతున్నది. దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టి అభివృద్ధికి అడ్డుపడటమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. అందుకోసం గవర్నర్లను పావులుగా వాడుకుంటుండటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు గవర్నర్ వ్యవస్థపై లోతైన చర్చ జరపాలి. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నది.
(వ్యాసకర్త: తెలంగాణ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షులు)
– జి.దేవిప్రసాద్