CM Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): ‘వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం’ ఇదీ సీఎం రేవంత్రెడ్డి నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నేత వరకు గ్యారెంటీల అమలుపై నిత్యం చెప్తున్న మాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఏయే తేదీల్లో ఏమేమి అమలు చేస్తామన్నది తేదీలతోసహా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తూ నోటిఫికేషన్ల తేదీలను కూడా ప్రకటించారు. ఈ లెక్క ప్రకారం ఈ నెల 1వ తేదీనే గ్రూప్-1 నోటిఫికేషన్ రావాలి. కానీ, ఇప్పటికీ దాని ఊసే లేదు. ఇదిలా ఉండగా, తాజాగా ఆరు గ్యారెంటీల అమలుపై కూడా రేవంత్ సర్కారు నాలుక మడతేసినట్టే కనిపిస్తున్నది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు గురువారం గవర్నర్ తమిళిసై ఉభయసభల సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంలో ‘100 రోజుల గడువు’ అనే మాట ఎక్కడా వినిపించలేదు. దీంతో గ్యారెంటీల అమలు గడువు గాయబ్ అయిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ తొలి ఉమ్మడి సెషన్లో రెండు లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం అని గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ప్రస్తుత ఉమ్మడి సెషన్లో ఆ మాట కూడా మారిపోయింది. కొత్తగా ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘ఏడాది గడువు’ కూడా మాయమైంది. 2024 డిసెంబర్లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి పలుమార్లు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంలో ఆ మాటను ఎందుకు పెట్టలేదనే చర్చ జరుగుతున్నది. మరో విషయం ఏమిటంటే 2 లక్షల ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని గవర్నర్ ప్రకటించటం.
ఒక్క టీఎస్పీఎస్సీ ద్వారానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ సాధ్యమయ్యే పనేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు ఎందరు? ఈ ఏడాది రిటైర్ అవుతున్నవారు ఎందరు? ఏడాదిలో టీఎస్పీఎస్సీ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే అంతమేరకు ఖాళీలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్న ఉద్యోగ ఖాళీలెన్ని? వాటిల్లో భర్తీ చేయగలిగే పోస్టులు ఎన్ని? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు టీఎస్పీఎస్సీ ద్వారానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలంటే ఏడాది సంగతి దేవుడెరుగు.. వచ్చే ఐదేండ్లలో కూడా సాధ్యం కాదని అంటున్నారు.
ఇప్పటికే గ్రూప్-1 గడువు తప్పిపోయిందని, దానిపై ప్రభుత్వం కనీసం వివరణ కూడా ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు. అసెంబ్లీ మొదటి సమావేశాల్లో ఉన్న ‘గడువు’ పదం రెండో సమావేశాల్లోనే మాయమైందని, మరో సమావేశం వచ్చే సమయానికి మొత్తం ఉద్యోగాల గ్యారెంటీనే మాయమవుతుందేమోనని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ‘గడువు’ ఎత్తేసిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే గత ఏడాది డిసెంబర్ 15న శాసనసభ, శాసనమండలి కలిపి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ప్రసగింస్తూ ‘ఆరు గ్యారెంటీలను వచ్చే 100 రోజుల్లో అమలుచేసేందుకు కార్యాచరణ తీసుకుంటాం’ అని స్పష్టంగా తెలిపారు. రెండు నెలల్లోనే ఆ మాట స్థానంలో కొత్త రాగం వచ్చి చేరింది. గురువారం నాటి ప్రసంగంలో ఆ పదమే ఉచ్ఛరించలేదు. మొత్తం 15 పేజీల ప్రసంగంలో ఒక్కటంటే ఒక్కచోట కూడా 100 రోజుల గడువు పదమే లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. 100 రోజుల గడువు స్థానంలో ‘నిర్దిష్ట సమయంలోపు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం’ అని పేర్కొన్నారు. 100 రోజుల గడువు కాస్తా.. నిర్దిష్ట సమయంగా మారిపోయింది. మరి నిర్దిష్ట సమయం అంటే ఎంత సమయమో ఎవరికీ తెలియదు. దీనిపై ప్రభుత్వమే స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉన్నది.