మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేఖ విధానాలకు, సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని కేకే 1 గనిపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్నెల్యే బాల్క సుమబ్ హాజరై కార్మికులకు సంఘీభావం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కోల్ ఇండియా, గుజరాత్ బ్లాకులను వేలం వేయకుండా తెలంగాణ బొగ్గు బ్లాకులను మాత్రమే వేలం వేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
మోదీ, అమిత్ షా తెలంగాణను అంధకారంలో నెట్టివేయడానికి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అందులో భాగంగా జెన్కో, సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా కాకుండా పన్నాగాలు పన్నుతున్నారని పేర్కొన్నారు.
స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసినా, టీఆర్ఎస్ ఎంపీలు, కార్మికులు పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పచ్చబడుతుంటే మోదీ, అమిత్ షా కళ్ళు ఎర్రబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు రావలసిన న్యాయమైన డిమాండ్లు, హక్కులను మోదీ, అమిత్ షా కాలరాస్తున్నారన్నారు. ఏడేళ్లలో ఇంతవరకూ తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించలేదని తెలిపారు.
రైతులకు, కార్మికులకు, వ్యవసాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం భరతం పట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకుని రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు.
ఏడేళ్లుగా సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని పోరాటం చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి తెలంగాణ బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం వారి చేత కాని తనానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రజలు, కార్మికులు ఢిల్లీకి బానిసలు కారని, గుజరాతీలకు గులాం చేయరని స్పష్టం చేశారు. అవసరమైతే సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాటి ఉద్యమస్ఫూర్తితో కార్మికుల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. అవసరమైతే ఢిల్లీలో పోరాటం చేస్తామన్నారు.
టీబీజీకేఎస్ తీసుకున్న సాహసోపేతమైన బంద్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని తెలిపారు. కేంద్రం కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే కార్మికుల తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.