జనగామ : ఆశా కార్యకర్తలను ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వమే. గతంలో ఆశాలు జీతం కోసం పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయి. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఆశాల మనసు తెలుసుకొని జీతాలను రూ. 9 వేల 750 కి పెంచారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఆశా వర్కర్ల జనగామ జిల్లా మహాసభను మంత్రి ఎర్రబెల్లి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆశా వర్కర్లు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సీఎం కేసీఆర్ వారికి స్మార్ట్ ఫోన్లు అందించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం 15 వందలు మాత్రమే ఉంటే..
ఇప్పుడు ఆశాల జీతం 9 వేల 750 కి చేరిందని ఆయన గుర్తు చేశారు. ఏడేండ్ల ఎంత పెరిగిందో ఆలోచన చేయాలన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆశా వర్కర్లకు ఇచ్చేది కేవలం రూ.4వేలు అయితే.. మన దగ్గర ఇస్తున్నది రూ.9వేల 750. మరో బీజీపీ రాష్ట్రం మధ్య ప్రదేశ్లో ఇస్తున్నది కేవలం రూ. 3 వేలు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్లో ఇస్తున్నది కూడా 3వేల రూపాయలు మాత్రమే అన్నారు. గతంలో మూడు నెలలకు ఒక్కసారి జీతాలు వచ్చేది గగనం. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నదని మంత్రి తెలిపారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. మీరు బాగా పని చేస్తున్నారు.
కరోనా కట్టడిలో ఆశాల పాత్ర అమోఘం అని ప్రశంసించారు. ప్రజారోగ్యం లో తెలంగాణ దేశంలో 3 వ స్థానంలో ఉంది. మనం మొదటి స్థానంలోకి వెళ్లేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.