హైదరాబాద్: అనుమతి లేని వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఎలా మంజూరు చేస్తారని కేంద్ర జలశక్తి శాఖను రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించించింది. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ ద్వారా నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలన్న ప్రతిపాధనపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ విషయాన్ని పునరాలోచించాలని కోరుతూ ఈఎన్సీ మురళీధర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
వెలిగొండ ప్రాజెక్టుకు ట్రైబ్యునల్ కేటాయింపులు లేవని, వరద జలాల ఆధారంగా ఆ ప్రాజెక్టును చేపట్టారని లేఖలో పేర్కొన్నారు. వెలిగొండకు అనుమతుల్లేవని గెజిట్లోనూ పేర్కొన్నారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెలిగొండపై గతంలోనే ఫిర్యాదు చేశామని అందులో ప్రస్తావించారు. అనుమతిలేని ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐబీపీ కింద కేంద్రం నిధులు ఇవ్వడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. నిధులు ఇచ్చేందుకు అర్హత ఉందో లేదో పరిశీలించాలని లేఖలో కోరారు.