హైదరాబాద్ : నిర్వచనానికి అందని వ్యక్తిత్వం. వేలకోట్ల భావాలకు ప్రతిరూపం. జీవాన్ని, జీవితాన్ని ఇవ్వడమే కాదు..జీవిత కాలపు ప్రేమను, మమకారాన్ని పంచడంలో తల్లిని మించి ఎవరూ ఉండరు. అలాంటి మాతృ మూర్తిని గొప్పగా ఆరాధించే ఈ రోజున రాష్ట్ర ప్రజలకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పనిచేస్తుందన్నారు. మహిళల రక్షణ, సమగ్ర వికాసం, సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ వారికి అడుగడుగునా అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.
ఆడపిల్ల అమ్మ గర్భంలో పడినప్పటి నుంచి ఆమె యుక్త వయసుకు వచ్చి పెళ్లి చేసుకుని, మళ్లీ తల్లి అయ్యే వరకు ప్రతి సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వడానికి గర్భం దాల్చిన ఆరు నెలల నుంచి ప్రసవం అయిన మూడు నెలల వరకు మూడు దఫాలుగా 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలు ఇచ్చి మహిళలకు, ఆడపిల్లకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు.
గర్భిణిని ప్రభుత్వ దవాఖానకు జాగ్రత్తగా తీసుకెళ్లి, ప్రసవం అనంతరం తల్లీ- బిడ్డలను క్షేమంగా ఇంటికి ఉచితంగా చేర్చే అమ్మ ఒడి పథకం, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవం అయితే తల్లీ- బిడ్డలకు అవసరమైన సబ్బులు, షాంపూ లు, పౌడర్, నూనె, బట్టలు, దోమతెరలు, పరుపు వంటి అనేక సామాన్లతో కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఆ తర్వాత ఆడపిల్లల విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 53 ప్రత్యేక రెసిడెన్షియల్ విద్యాలయాలు పెట్టి వారి ఉన్నత విద్యకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
పెళ్లీడుకు వచ్చిన పేదింటి అమ్మాయి పెండ్లి ఆ తల్లిదండ్రులకు భారం కావద్దని భావించిన సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద 1,00,116 రూపాయలు ఇచ్చి ఇంటి పెద్దగా, అన్నగా, మేనమామగా ఆదుకుంటున్నారన్నారు.
ఆడపిల్ల రక్షణ కోసం షీ టీమ్స్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్, భరోసా కేంద్రాలు, సఖీ కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళల పేరు మీదే రేషన్ కార్డులు, భూముల రిజిస్ట్రేషన్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తల్లీ, బిడ్డల సంరక్షణ కోసం అంగన్ వాడీలలో ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తున్నాం.
దీనిలో తల్లి కోసం టీకాలు, గుడ్లు, పాలు, మధ్యాహ్న భోజనం ద్వారా పోషకాహారం, వైద్య సాయం అందిస్తున్నమన్నారు. అదేవిధంగా పుట్టిన బిడ్డల నుంచి ఆరేళ్ల వరకు వారి ఆరోగ్యం కోసం బాలామృతం, గుడ్లు, పాలు ఇస్తున్నామని, కిండర్ గార్డెన్ ప్రీ స్కూల్ నిర్వహిస్తూ వారి సమగ్ర వికాసానికి కృషి చేస్తున్నామన్నారు.
ఈ కరోనా సమయంలో తల్లిదండ్రులు ఆ మహమ్మారి బారిన పడి పిల్లల సంరక్షణకు కుటుంబంలో ఎవరూ లేకపోతే ఈ ప్రభుత్వమే ఒక తల్లిగా మారి వారి సంరక్షణ చేసేందుకు చైల్డ్ హెల్ప్ లైన్ పెట్టీ, ట్రాన్సిట్ హోమ్స్ ఏర్పాటు చేసి వారి యోగ క్షేమాల బాధ్యత తీసుకుంది అన్నారు.
ఇలా ప్రతి అంశంలో, సందర్భంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం మహిళకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్
తాండూరులో కొవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించిన మంత్రి