హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, హెల్పర్లకు పెంచిన వేతనాలను డిసెంబర్ నెల నుంచే వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్టు స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500 నుంచి రూ.13,650కు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతానాన్ని రూ.ఆరు వేల నుంచి రూ.7,800కు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న వేతన పెంపు నిర్ణయం వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది లబ్ధిపొందుతారని చెప్పారు. వీరిలో అంగన్వాడీ టీచర్లు 31,711 మంది, హెల్పర్లు 31,711 మంది, మినీ అంగన్వాడీ టీచర్లు 3,989 మంది ఉన్నట్టు వివరించారు.
రాష్ట్రంలో స్త్రీ, శిశుసంక్షేమశాఖ చేపడుతున్న కార్యక్రమాలపై శుక్రవారం మహిళా కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. అంగన్వాడీల విషయంలో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకొంటుండగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలో మూడుసార్లు వేతనాలు పెంచిందని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గిందని చెప్పారు. రాష్ట్ర వాటా పది నుంచి 40 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను పరిగణనలోకి తీసుకొంటే, అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో కేంద్రం వాటా 19%, హెల్పర్ల వేతనాల్లో 17% మాత్రమే ఉంటుందని తెలిపారు. 40% చెల్లించాల్సిన తెలంగాణ ప్రభుత్వం 80 శాతంపైగా భరిస్తున్నదని వివరించారు. అన్నీ తామే చేస్తున్నామని గొప్పలు చెప్పుకొనే బీజేపీ నాయకులు ఇప్పటికైనా వాస్తవా లు తెలుసుకోవాలన్నారు. బీజేపీ నేతల అసత్య ప్ర చారాలను అంగన్వాడీ సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆమె సూచించారు.