హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ను లోతుగా విచారిస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరికొన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. హెచ్ఎండీఏ భూముల వేలంలో ఆయన ఎన్నో అక్రమాలకు పాల్పడినట్టు తేల్చారు. ఈ వేలానికి ముందే సంబంధిత సమచారాన్ని పలువురు రియల్టర్లకు అందజేశారని, తద్వారా వేలంలో వారికే భూములు దక్కేలా హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారని, భూముల ధరలను నిర్ణయించడంలోనూ వారే కీలకపాత్ర పోషించారని గుర్తించారు.
ఆ అవకతవకలపై పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో ఈ వేలం పాటను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడంతోపాటు ఇప్పటివరకు జరిగిన భూముల వేలంపై విచారణ చేపట్టినట్టు తెలిసింది. హెచ్ఎండీఏ భూముల వేలంలో అక్రమాలకు పాల్పడటం ద్వారా వచ్చిన సొమ్మును శివబాలకృష్ణ ఎప్పటికప్పుడు తన కుటుంబసభ్యులు, బంధువులు, పనిమనుషుల పేరిట బినామీ ఆస్తులుగా మార్చినట్టు సమాచారం. దీంతో శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని ఏసీబీ ఇప్పటికే కలెక్టర్కు లేఖ రాసింది. మరోవైపు శివబాలకృష్ణ అక్రమాలకు సహకరించినట్టు ఆరోపణలు ఎదురొంటున్న ఐఏఎస్ అధికారిపై చర్యలు చేపట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నది.