హైదరాబాద్ : స్వయం సహాయ సంఘాలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహానిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనా సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ)లకు ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా ప్రభుత్వం విడుదల చేసిన రూ. 200 కోట్లను వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయాలని అధికారులకు ఆయన సూచించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్ ద్వారా అమలు జరుగుతున్న వివిధ పథకాలపై మంత్రి ఇవాళ సమీక్షించారు.
మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న లింకేజీపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇందులో భాగంగా తొలివిడత రూ. 200 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంచాయతీరాజ్ శాఖకు చెందిన రోడ్లు దెబ్బతిన్నాయని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30శాతం పెంచామని గుర్తుచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్ లలో పనిచేసే అధికారులు, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు పాల్గొన్నారు.