ధర్మపురి, జూన్ 5 : జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయ విస్తరణలో భాగంగా పరిహారం పెంపు విషయంలో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాల కోల్పోతున్న నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైంది. దేవస్థానం ఉత్తర దిశలో 14 ఇండ్లు, నాలుగు ఖాళీ స్థలాలకు అంగీకారం లేకపోయినా.. ఎంతో విలువైన స్థలాలను నామమాత్రపు ధరతో సర్కార్ స్వాధీనం చేసుకునేందుకు సన్నద్ధం కావడం, బాధితులు విజ్ఞప్తులు చేయడంపై గత నెల 28న ‘ధర్మపురిలో దౌర్జన్యకాండ!’ శీర్షికన నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితం కాగా సర్కార్ స్పందించింది. ఆ మేరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధిత కుటుంబాలకు గతంలో ప్రతిపాదించిన పరిహారం కంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చే దిశగా కసరత్తు చేసినట్టు తెలిసింది. అందులో భాగంగానే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం నిర్వాసితులతో దేవస్థాన సమావేశం మందిరంలో మొదటిసారి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
భూ సేకరణతో తమకు జరుగుతున్న నష్టాన్ని బాధితులు.. మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని , జీవనాధారాన్ని కోల్పోతున్న కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గతంలో గజానికి రూ.2,100 ధర నిర్ణయించగా.. దీనికి మూడు రెట్లు (రూ.6,300) అదనంగా ఇస్తామని చెప్పిన అధికారులు, ఇప్పుడు ఐదు రెట్ల వరకు (గజానికి రూ.10,500) పెంచే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పునరావాసం కింద (ఆర్అండ్ఆర్ ప్యాకేజీ) గతంలో కుటుంబానికి రూ.12 లక్షలు ప్రకటించగా.. ఇప్పుడు రూ.18 లక్షల వరకు పెంచే ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే పరిహారం పెంపుపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడిన తర్వాతే బాధితుల డిమాండ్లకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడం, అధికార యంత్రాంగం నుంచి స్పష్టత లేకపోవడంతో బాధితులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ అభివృద్ధిలో భాగంగా భూము లు కోల్పోతున్న నిర్వాసితుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ముందు కు సాగుతాం. 2017-18 భూసేకరణ చట్ట ప్రకారం.. నిర్వాసితులకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. భూనిర్వాసితులతో మరోసారి చర్చలు జరుపుతాం. వారిని పూర్తిస్థాయిలో తృప్తి పరిచిన తర్వాతే భూసేకరణ జరుగుతుంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేవస్థాన అభివృద్ధికి పట్టణ ప్రజలు, భూనిర్వాసితులు సహకరించాలి.