మెడికల్ డివైజెస్ పార్కులో ఇప్పటికే దాదాపు 50 కంపెనీలు రూ.1,424 కోట్ల పెట్టుబడితో మాన్యుఫ్యాక్చరింగ్, పరిశోధన, అభివృద్ధి యూనిట్లను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి. వీటిల్లో ఏడువేల మందికి ప్రత్యక్షంగా, లక్షలమందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. బుధవారం ప్రారంభమైన 7 కంపెనీలు రూ.265 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఆ కంపెనీల్లో ఇప్పటికే దాదాపు 1,300 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
వైద్య పరికరాల పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకంగా మారుతున్నది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మెడికల్ డివైజెస్ పారును ప్రపంచానికి గ్లోబల్ ఫ్యాక్టరీగా మాత్రమే కాకుండా గ్లోబల్ మెడ్టెక్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్గా మారుస్తాం. కొవిడ్-19 టీకాలను వేగంగా ఉత్పత్తిచేయటంలో కీలకంగా మారిన ఇంజినీర్డ్ మోడిఫైడ్ ఆర్ఎన్ఏ సాంకేతికత అభివృద్ధి, బయోప్రోస్తెటిక్ ఇంప్లాంట్లు, ఇంట్లోనే జన్యు పరీక్ష చేసుకొనే కిట్లు, కార్డియాక్ డయాగ్నస్టిక్ టూల్స్, అల్ట్రాసౌండ్ పరికరాలు, మొబైల్ వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పీపీఈ కిట్లు తదితర పరికరాల ఉత్పత్తిలో పెట్టుబడులను రాష్ట్రప్రభుత్వం ప్రోత్సహించింది.
–మంత్రి కేటీఆర్
కంపెనీలు.. పెట్టుబడులు.. (రూ. కోట్లలో)
ప్రోమియా థెరప్యూటిక్స్- రూ.51.20
హువెల్ లైఫ్ సైన్సెస్ రూ.17.25
ఆర్కా మెడికల్ డివైజెస్ రూ.15.37
ఎల్వికాన్ ఇండియా రూ.4.04
రీస్ మెడి లైఫ్ రూ.3.31
ఆకృతి ఆక్యులోప్లాస్ రూ.1.53
ఎస్వీపీ టెక్నో ఇంజినీర్స్ రూ.1.44
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2030 నాటికి రూ.లక్ష కోట్లకు పెంచాలనేది రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ బృహత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటికే జీవ ఔషధ రంగంలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, రాబోయే రోజుల్లో సూదులు, సిరంజీలు, ఐవీ ఫ్లూయిడ్స్, గ్లౌజ్లు తదితర వైద్య పరికరాల ఉత్పత్తికి కేరాఫ్గా నిలుస్తుందని చెప్పారు. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలన్నింటికీ హైదరాబాద్ నగరాన్ని టాప్-క్లాస్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా నిలబెడతామని స్పష్టంచేశారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కులో ఏడు కంపెనీలను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మెడికల్ డివైజెస్ పార్కులో ఒకేరోజు ఏడు కంపెనీలను ప్రారంభించడం మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. జీవ ఔషధరంగం, వైద్యపరికరాలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి, తయారీ విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఇప్పటికే ఒక గుర్తింపు సాధించిందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని ఏర్పాటుచేసిందని, షామీర్పేటలో జీనోమ్వ్యాలీని నెలకొల్పిందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 35శాతం వాటా హైదరాబాద్దేనని వివరించారు. ఇప్పుడు మెడ్టెక్ పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించామని చెప్పారు. నాణ్యమైన వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సాధనాలు, ఔషధాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను రాష్ట్రప్రభుత్వం ముందుగానే గుర్తించి ఆయా విభాగాల్లో పరిశోధన, ఆవిషరణ, తయారీని ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. వైద్య పరికరాల పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకంగా మారుతున్నదని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వివరించారు. మెడికల్ డివైజెస్ పారును ప్రపంచానికి గ్లోబల్ ఫ్యాక్టరీగా మాత్రమే కాకుండా గ్లోబల్ మెడ్టెక్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్గా మారుస్తామని నొక్కిచెప్పారు. కొవిడ్-19 టీకాలను వేగంగా ఉత్పత్తిచేయటంలో కీలకంగా మారిన ఇంజినీర్డ్ మోడిఫైడ్ ఆర్ఎన్ఏ సాంకేతికత అభివృద్ధి, బయోప్రోస్తెటిక్ ఇంప్లాంట్లు, ఇంట్లోనే జన్యు పరీక్ష చేసుకొనే కిట్లు, కార్డియాక్ డయాగ్నస్టిక్ టూల్స్, అల్ట్రాసౌండ్ పరికరాలు, మొబైల్ వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పీపీఈ కిట్లు తదితర పరికరాల ఉత్పత్తిలో పెట్టుబడులను రాష్ట్రప్రభుత్వం ప్రోత్సహించిందని గుర్తుచేశారు.
హైదరాబాద్లాంటి సమగ్ర, పకడ్బందీ బహుళ క్రమశిక్షణ ఏకో సిస్టమ్ దేశంలోమరెక్కడా లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో 20 కంటే ఎకువ ఇన్నోవేషన్ కేంద్రాలున్నాయని, వాటి కార్యకలాపాలకు మద్దతుగా మెడికల్ డివైజెస్ పారులో తయారీని ప్రోత్సహించేందుకు టీ-వర్స్ పేరుతో దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైప్ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. 3డి ప్రింటెడ్ బయోనిక్ ఆర్మ్స్, ఇమేజింగ్ సిస్టమ్స్, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్, మొబైల్ డయాలసిస్ యూనిట్లు, నెక్స్ట్ జనరేషన్ స్టెంట్లు, ఇంప్లాంట్ల వంటి వైద్య పరికరాల తయారీపై దృష్టి సారించాలని సూచించారు. మెడ్ట్రానిక్ కంపెనీ అమెరికా వెలుపల హైదరాబాద్లోనే అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జర్మనీలో ప్రధాన కార్యాలయం ఉన్న ప్రముఖ వైద్య పరికరాల సంస్థ బీబరౌన్ రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు. మెడ్టెక్ పారులో యూనిట్ల ఏర్పాటు ప్రక్రియలో కంపెనీలు తమ వాల్యూ చైన్ని పెంచేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, భూపాల్రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, నాగప్పన్, రాజశ్రీ, గీత, బి బ్రౌన్ మెడికల్ కంపెనీ జనరల్ మేనేజర్ రవి వాలియా తదితరులు పాల్గొన్నారు.
మా సంస్థలో సైంటిస్టుగా పనిచేసిన శిశిర్ మెడికల్ డివైజెస్ పార్కులో సొంతంగా లైఫ్ సైన్సెస్ యూనిట్ ఏర్పాటుచేయటం ఆనందంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నది. అనేక వైద్య పరికరాలు హైదరాబాద్లోనే ఉత్పత్తి చేయడం అభినందనీయం.
–శాంతాబయోటెక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి
పరిశ్రమ పెట్టేందుకు తెలంగాణ అనుకూలంగా ఉన్నది. అనుమతులన్నీ అత్యంత వేగంగా వస్తున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక విధానం బాగున్నది. మెడికల్ డివైజెస్ పార్కులో ప్రభుత్వం మాకు స్థలంతోపాటు మౌలిక వసతులు కల్పించింది. కంటి అద్దాలకు దేశంలో భారీ డిమాండ్ రాబోతున్నది. ఇప్పుడు అద్దాల ఫ్రేమ్లు దిగుమతి చేసుకొంటున్నాం. ఇక నుంచి మేం ఇక్కడే మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ నినాదంతో ఫ్రేమ్లు తయారు చేస్తాం.
–కుల్దీప్, ఆకృతి ఐకేర్ ఇండస్ట్రీస్
సుల్తాన్ఫూర్ మెడికల్ డివైజెస్ పార్కులో సౌకర్యాలు చూస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నట్టుగా అనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఈ పార్కును ఏర్పాటుచేసింది. పరిశ్రమలు పెడుతామని చెప్పటమే ఆలస్యం ప్రభుత్వం అన్నిరకాలుగా సాయం చేసింది. మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో కొత్త శక్తి వచ్చింది. రూ.6 కోట్లతో పరిశ్రమ పెట్టాం.
–ఆర్ మహేశ్, అశోక్-పార్ట్నర్స్, ఎస్వీపీ టెక్నో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ అద్భుతంగా ఉన్నది. ఇండస్ట్రియల్ ఏరియా చూస్తే ఇక్కడ జరుగుతున్న ప్రగతి కనిపించింది. ఈ అభివృద్ధిని చూస్తే ముచ్చటేస్తున్నది. ఇండియాలో మెడికల్ ఉత్పత్తుల తయారీ రంగం ఇప్పుడిప్పుడే ఊపందుకొంటున్నది. ఇక్కడి పరిశ్రమల్లోని ఉత్పత్తులు అందుబాటులోకి వస్తే వైద్యఖర్చులు తగ్గుతాయి. నాణ్యత కూడా పెరుగుతుంది.
-పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఎస్ నటరాజన్