హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): మేధో సంపత్తి హక్కుల నమోదులో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. ట్రేడ్మార్కుల నమోదులో 9వ స్థానాన్ని, డిజైన్ల నమోదులో 13వ స్థానాన్ని దక్కించుకున్నట్టు 2021-22 సంవత్సరానికి సంబంధించిన నివేదికలో మేధో సంపత్తి హక్కుల విభాగం వెల్లడించింది. ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 66 వేల దరఖాస్తులకు పేటెంట్లు లభించాయని, వాటిలో తెలంగాణకు చెందినవి 1,724 ఉన్నాయని వివరించింది. పేటెంట్ల సాధనలో తెలంగాణ కంటే ముందు తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ ఉన్నట్టు తెలిపింది.
డిజైన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా 22 వేల దరఖాస్తులకు గుర్తింపు లభించిందని, వాటిలో తెలంగాణకు చెందినవి 180కిపైగా ఉన్నాయని పేర్కొన్నది. కంపెనీలు, పరిశ్రమలు తమ నూతన ఆవిష్కరణలను, కొత్త డిజైన్లను మేధో సంపత్తి హక్కుల కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల వాటిని ఇతరులు కాపీ చేయకుండా రక్షణ లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా అదే తరహా ఆవిష్కరణలు రూపొందిస్తే చట్ట ప్రకారం శిక్షకు గురవుతారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఆధ్వర్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ కార్యాలయం పేటెంట్లను నమోదు చేస్తుంది. కోల్కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోని పేటెంట్ కార్యాలయాల్లో వాటిని నమోదుచేస్తారు. ఆన్లైన్ ద్వారా కూడా పేటెంట్లను నమోదు చేసుకునే వీలున్నది.
ప్రథమ స్థానం లభించే అవకాశం
స్టార్టప్స్లో తెలంగాణ దేశంలోనే ఎంతో ముందంజలో ఉన్నది. ప్రపంచంలోని పలు ప్రఖ్యాత సంస్థల పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాలు రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ, ఔషధ, జీవశాస్ర్తాల రంగంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. అయినా మేధో సంపత్తి హక్కులు పొందేందుకు చాలా సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. పేటెంట్ల కోసం దేశంలో 66 వేల సంస్థలు దరఖాస్తు చేసుకుంటే.. వాటిలో తెలంగాణ నుంచి 1,724 మాత్రమే ఉండడం విచారకరం. రాష్ట్రంలోని కంపెనీల్లో చైతన్యం వస్తే పేటెంట్ల సాధనలో తెలంగాణ అగ్రస్థానాన్ని దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. – సుభజిత్ సాహా, లీగల్ హెడ్, రెసొల్యూట్ గ్రూప్