బాండ్ల విక్రయానికి రిజర్వ్ బ్యాంకు అనుమతి
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 వేల కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. బాండ్ల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి. ఇటీవల ఆర్బీఐ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల కోట్ల రుణాన్ని తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.53,970 కోట్ల రుణాలను సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. జీఎస్డీపీ విలువ ప్రకారం నెలకు దాదాపు రూ.4 వేల కోట్ల రుణం తీసుకునే అవకాశం రాష్ర్టానికి ఉన్నది. ఈ నిధులను మూలధనం కింద ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం
నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి ఉంటే కొత్త రుణాల స్వీకరణకు కేంద్రం అడ్డుచెప్పరాదు. ఎఫ్ఆర్బీఎం ప్రకారం జీఎస్డీపీ విలువలో 25% వరకు రుణాలు తీసుకొనే అవకాశం రాష్ట్రానికి ఉంటుంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ అప్పు 23% మాత్రమే. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేయకుండా కేంద్రం ఆటంకాలు సృష్టిస్తున్నది. తెలంగాణ కంటే ఎకువ అప్పులు చేసిన రాష్ట్రాలు అదనంగా రుణాలను సమీకరించుకొనేందుకు అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కొత్త రుణాల సమీకరణలో తెలంగాణకు మాత్రం అడ్డుతగులుతున్నది. తద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నది. బడ్జెట్, అప్పులు తదితర సాకులను చూపుతూ ఇప్పటికే రెండు నెలల పాటు రుణాలు తీసుకోకుండా అడ్డుకోవడంతో తెలంగాణ సుమారు రూ.8 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. దీంతో కేంద్ర తీరును సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ఎండగట్టారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి రుణాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ సుదీర్ఘ లేఖ రాయడంతో నరేంద్రమోదీ సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చింది.