హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) కొత్త కార్యవర్గం త్వరలోనే ఏర్పాటుకానున్నది. నూతన కార్యవర్గాన్ని 2024లో ఎన్నుకొనే అవకాశాలున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 28న హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. తదుపరి 33 జిల్లాలకు ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొంటారు.
మొత్తం ప్రక్రియను మూడు వారాల్లో పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, తమ సంఘంలోఎలాంటి గందరగోళం లేదని సంఘం నేతలు ప్రకటించారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవి ఊహాజనిత ఆరోపణలని సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నేతలు సామల సహదేవ్, పీ రవీందర్కుమార్, బీ వెంకటయ్య, ఎంబీ కృష్ణాయాదవ్, జీ వెంకటేశ్వర్లు, జగన్మోహన్రావులు తెలిపారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ సంఘానికి ఎల్లవేళలా అండగా నిలిచారని, ఆయన సేవలు ఎప్పటికీ ఉంటాయని వారు స్పష్టంచేశారు.