హైదరాబాద్/సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అయినట్టు తెలిసిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా ఐపీఎస్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటుచేసింది. సిట్పై తమకు నమ్మకం లేదని, సిట్ సిట్ సిడౌన్ అంటూ ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి. మరెన్నో అవరోధాలు సృష్టించాయి. అవేవీ లెక్క చేయకుండా సిట్ తన పని తాను చేసుకుంటూ పోయింది. లీక్వీరులకు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను సేకరిస్తూ, ఒక్కొక్కరిని విడివిడిగా విచారిస్తూ, వచ్చిన సమాచారంతో రహస్యంగా విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుంటూ వచ్చింది. 87 రోజులపాటు దర్యాప్తు కొనసాగించిన సిట్ స్వల్ప వ్యవధిలోనే కోర్టుకు ప్రాథమిక చార్జిషీట్ అందజేసింది.
గ్రూప్-1 పేపర్లు లీక్ అయినట్టు గుర్తించిన సిట్.. ప్రధాన సూత్రధారులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డిని తొలుత అదుపులోకి తీసుకున్నది. వారి ద్వారా రేణుక, ఢాక్యా, రాజేశ్వర్, శ్రీనివాస్ వంటి వారిని విచారించి మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నది. డీఏవో, ఏఈఈ, ఏఈ పరీక్షల్లో కూడా పేపర్లు లీకైనట్టు తేల్చింది. దీంతో టీఎస్పీఎస్సీ అధికారులు గ్రూప్-1తో సహా ఆ మూడు పరీక్షలను సైతం రద్దు చేశారు. వాటితోపాటుగా అప్పటికే జరుగబోయే టీబీవో, వీఏఎస్ పరీక్షలకు సంబంధించిన మాస్టర్ కీని కూడా వారి నుంచి స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు.. ప్రభుత్వానికి, టీఎస్ఎస్పీఎస్సీకి సమాచారం అందించడంతో ఆ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ మొత్తం వ్యవహారంలో సిట్ 49 మందిని అరెస్టు చేసింది.
నేరస్థులను గుర్తించడం కోసం సిట్ ఎంతో శ్రమించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్లో వందకుపైగా మార్కులు వచ్చిన అభ్యర్థుల ఇండ్లకు వెళ్లి వారిని విచారించింది. వారికి నిందితులతో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. గ్రూప్-1తోపాటు మరో మూడు పరీక్షలకు సంబంధించిన విచారణ నిష్పక్షపాతంగా కొనసాగేందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ, కస్టోడియన్ స్టేట్మెంట్ సైతం రికార్డు చేసింది. అయితే సిట్ దర్యాప్తును వ్యతిరేకించిన కొందరు ప్రతిపక్ష నాయకులు ఈ లీకేజీల వ్యవహారంపై ఈడీని ఆశ్రయించారు. ఈడీ అధికారులు కూడా అత్యంత రహస్యంగా విచారణ చేపట్టినా చివరికి సిట్ చేస్తున్న విచారణకే మొగ్గుచూపారు. ఒకవైపు ఈడీ కోరిన సమాచారాన్ని ఇస్తూ.. మరోవైపు తమ పని తాము సైలెంట్గా చేసుకుంటూ వెళ్లిన సిట్ అధికారులు స్వల్పకాలంలోనే చార్జిషీట్ దాఖలు చేయడం విశేషం. అన్ని పరీక్షలకు సంబంధించి మొత్తం 49 మందిని అదుపులోకి తీసుకున్నామని, న్యూజిలాండ్కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవల్సి ఉన్నదని సిట్ తెలిపింది.
సిట్ దర్యాఫ్తులో ఏ కోణాన్నీ వదల్లేదని స్పష్టమవుతున్నది. ఈ వ్యవహారం తెరపైకి వచ్చిన తొలినాళ్లలో ప్రతిపక్షపార్టీలు చేసిన విమర్శలు, ఆరోపణలు అన్నీ బూటకాలేనని ఇప్పుడు అర్థమవుతున్నది. సిట్ ప్రతిపక్ష పార్టీల నాయకులు చేసిన ఆరోపణలపై సైతం లోతైన విచారణ జరిపింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు సైతం నోటీసులు జారీ చేసి, వారు చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని కోరింది. అయితే, ఆరోపణలు చేసిన నాయకుల నుంచి ఏ ఒక్క ఆధారమూ లభించలేదు.