కరీంనగర్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్తోనే ఈ రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉన్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై అన్ని పార్టీలు ఏకమై దాడులకు దిగుతున్నాయని, తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సంసిద్దులు కావాలని పిలుపు నిచ్చారు. శుక్రవారం కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకుంటే ఆవిర్భవించిన టీఆర్ఎస్ అనే ఆయుధంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారని, ఇక్కడి అభివృద్ధిని సంక్షేమాన్ని చూస్తున్న దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోనే మరో ఆయుధాన్ని కోరుకుంటున్నారని అదే బీఆర్ఎస్ ఆవిర్భావమని అన్నారు. కార్యకర్తలు పార్టీకి అండగా ఉండి దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిశగా అడుగులు వేయాలని కోరారు. మంత్రులుగా ఉన్న తమపై రాళ్లు వేస్తున్నారని, బురద జల్లుతున్నారని మండిపడ్డారు. మనం ప్రజలకు జవాబుదారులమని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వ పరంగా మన పాత్ర మనం నిర్వహించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ను బతికించుకోవాలని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిని సాధించి పచ్చబడిన తర్వాత మళ్లీ ఆంధ్రోళ్ల నుంచి ముప్పు కనిపిస్తున్నదని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు మళ్లీ కుట్రలు చేస్తున్నారని, కొందరు పాదయాత్రలు చేస్తున్నారని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కష్టపడి పని చేసి విజయాన్ని ముద్దాడగలిగామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ కసి, పట్టుదల ప్రతి కార్యకర్తలో కనిపించాలని చెప్పారు. కార్యకర్తల రక్షణే తమ ధ్యేయని, పార్టీని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. దాడులు చేయడం మన ఉద్దేశం కాకపోయినా ప్రతిపక్ష పార్టీలు చేసే దాడులను తిప్పికొట్టాలని అన్నారు. అవకాశాలు అందరికి వస్తాయని, ఓపికతో వేచి ఉండాలని కార్యకర్తలను కోరారు.