Telangana | హైదరాబాద్ : చంచల్గూడ కేంద్ర కారాగారంలో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఖైదీల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో మెరిట్ సాధించిన ఖైదీల పిల్లలకు, పదవ తరగతి వారికి రూ. 3 వేల చొప్పున, ఇంటర్ వారికి రూ. 5 వేల చొప్పున, ఉన్నత చదువులు చదువులు చదివే వారికి రూ. 15000 చొప్పున అందిస్తున్నట్టు తెలిపారు.
డబ్బులు లేక ఫైన్ కట్టలేక విడుదల కాలేని శిక్ష ఖైదీలకు కూడా ఫైన్ అమౌంట్ చెల్లించి వారిని ఇవాళ విడుదల చేసినట్లు తెలిపారు. వివిధ జైళ్లల్లో శిక్ష ఖైదీలకు వడ్డీ రహిత రుణాలు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు అందజేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా, మహిళా ఖైదీల పిల్లలకి న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భముగా రాష్ట్ర జైళ్లలో శిక్షా ఖైదీలకు క్రీడలు, పాటల పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు.
ఈ కార్యక్రమమంలో జైళ్ల శాఖ ఐజీ వై రాజేష్, డీఐజీలు యన్ మురళీబాబు, డి శ్రీనివాస్, యం సంపత్, పర్యవేక్షణాధికారులు సంతోష్ రాయ్, కళాసాగర్, పర్యవేక్షణాధికారి పీఏసీ అమరావతి, మహిళా జైలు పర్యవేక్షణాధికారి, డాక్టర్ రమణ, జైళ్ల శాఖ హెడ్ ఆఫీసు సిబ్బందితో పాటు ఖైదీల కుటుంబాలు, వారి పిల్లలు కూడా పాల్గొన్నారు.